Edupayala Jatara Dates : తెలంగాణ రాష్ట్రంలోనే మేడారం జాతర తర్వాత అత్యంత వైభవంగా జరిగే రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. ఏడు పాయల మధ్య వెలిసిన ఆ వనదుర్గమ్మ సాక్షిగా, ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం , ఆలయ కమిటీ సర్వ సిద్ధం చేస్తోంది. మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి, అమ్మవారి పాదాల చెంత నుంచి ప్రవహించే ఈ పవిత్ర క్షేత్రానికి ఏటా కోట్లాది మంది భక్తులు తరలివస్తుంటారు.
ఈ ఏడాది కూడా జాతరలో భాగంగా మొదటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకోనున్నారు. రెండో రోజైన ఫిబ్రవరి 16న జాతరలోనే ప్రధాన ఘట్టమైన ‘బండ్ల ఉత్సవం’ అత్యంత కోలాహలంగా సాగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదర్శనగా తిరుగుతూ మొక్కులు తీర్చుకుంటారు. ఆఖరి రోజైన ఫిబ్రవరి 17న రథోత్సవంతో ఈ మహా క్రతువు ముగుస్తుంది.
ఈ జాతరకు కేవలం మెదక్ జిల్లా నుంచే కాకుండా సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ , పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా సుమారు 15 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనసమూహానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు స్నానాల సమయంలో ఇబ్బంది కలగకుండా మంజీరా నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాటు, ఘాట్ రోడ్ల మరమ్మతులు, బారికేడ్ల నిర్మాణం , తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. రవాణా సౌకర్యం కోసం తెలంగాణ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, భారీ పోలీస్ బందోబస్తును కూడా మోహరిస్తున్నారు. వనదుర్గమ్మ ఆశీస్సుల కోసం వచ్చే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేలా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
High Court: అలా చేస్తే భార్యకు “భరణం” చెల్లించాల్సిన అవసరం లేదు..