Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..

  • దేవదుర్గలో బంగారం, రాగి అన్వేషణకు శ్రీకారం
  • సింగరేణికి దక్కిన ఎక్స్‌ప్లోరేషన్ హక్కులతో పనులు
  • మైనింగ్ ప్రాజెక్టుతో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు
  • సైట్ ఆఫీస్, హెలిప్యాడ్ ఏర్పాటుకు భట్టి ఆదేశాలు
Bhatti

Bhatti

కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూరు జిల్లా, దేవదుర్గ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించి, ఖనిజ అన్వేషణ ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. 136 సంవత్సరాల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్న సింగరేణి సంస్థ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ్ బ్లాక్ ఎక్స్‌ప్లోరేషన్ హక్కులను దక్కించుకుందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతమై బంగారం, రాగి విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దక్కడంతో పాటు ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పనుల పర్యవేక్షణ వేగవంతం చేసేందుకు సింగరేణి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక సైట్ ఆఫీస్‌ను, హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న తెలుగు, కర్ణాటక ప్రజల మధ్య విడదీయరాని సాంస్కృతిక బంధం ఉందని, స్థానిక ప్రజల అండదండలతో ఈ ప్రాజెక్టును విజయవంతం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేద్దామని కోరారు. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ, గతంలో తాను ఇక్కడ సీఐగా పనిచేశానని, ఇప్పుడు సింగరేణి అధినేతగా బంగారు, రాగి నిక్షేపాల అన్వేషణ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు లింగదహళ్ళి చేరుకున్న భట్టి విక్రమార్కకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, ఆయన లింగదహళ్ళిలోని చారిత్రక శ్రీ పరమానంద శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.