NTV Telugu Site icon

Damodara Raja Narsimha : మహబూబ్ నగర్ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పరిశీలించిన మంత్రి దామోదర

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1225 పడకల (బెడ్స్) సామర్థ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మేఘు రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణిక రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను, అన్ని విభాగాలను తిరిగి పరిశీలించారు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ మ్యాపును పరిశీలించారు. మంత్రి పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నెల వరకు నిర్మాణ పనులను పూర్తి చేసి ఆసుపత్రుని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సామాన్యుడికి మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య విద్యను అందించేందుకు టీచింగ్ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలనీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఈ సందర్బంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. మహబూబ్నగర్ పట్టణంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నీ ఈ సంవత్సరం చివరలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన సిబ్బంది డాక్టర్లు స్పెషాలిటీ డాక్టర్లు నర్సింగ్ స్టాప్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, శానిటేషన్ సిబ్బంది సుమారు 600 మంది కి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు. పేదవానికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. సామాన్యుడు సర్కార్ దావాఖాన ను నాది అని భావనతో ఉండాలన్నారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నీటిపారుదల , వైద్య, ఆరోగ్య , విద్యా రంగాల అభివృద్ధితోపాటు పర్యాటకాభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రాధాన్య అంశాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామన్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం అభివృద్ధి పథకాల అమలులో భాగస్వామ్యం చేసుకోవాలని మంత్రి కోరారు. వచ్చే 4 ఏండ్ల లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే కార్యాచరణ ను రూపొందిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.