Site icon NTV Telugu

Damodar Raja Narasimha : కాంగ్రెస్‌కు కోవర్ట్‌ రోగం పట్టింది

Raja Narasimha

Raja Narasimha

తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి చెలరేగుతోంది. రోజుకొకరు అసంతృప్తి నేతలు బయటికొస్తున్నారు. అయితే.. అసంతృప్తి నేతలకు ఇప్పటికీ పీసీసీ సమాధానం ఇవ్వలేదు. అయితే.. పీసీసీకి, సీఎల్పీకి గ్యాప్‌ ఉందని భట్టి విక్రమార్క ఒప్పుకున్నారు. అయితే.. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు దామోదర్‌ రాజనర్సింహ ఎన్టీవీతో మాట్లాడుతూ.. నాయకుడు, నాయకుల మధ్య సంపూర్ణ విశ్వాసం ఉండాలన్నారు. నాయకత్వం మీద అసంతృప్తి ఉన్న మాట నిజమేనని, పార్టీలో ఎవరి మీదా ఎవరికీ నమ్మకం లేదని ఆయన వెల్లడించారు. పదవులిచ్చినవారికి ఏ అర్హతలున్నాయని ఇచ్చారు..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో వర్గాలు కొత్త కాదని, కాంగ్రెస్‌లో గ్రూపులకు అనేక కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కోవర్టు కల్చర్‌ గత ఐదారేళ్ల నుంచి మొదలైందని, కోవర్ట్‌ కల్చర్‌ను పార్టీ నుంచి తరిమి కొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : India-China Border Clash: చైనా బలహీనతలను భారత్ గుర్తించింది.. మరో యుద్ధం తప్పదు.. చైనా నెటిజన్ల స్పందన

2014 నుంచి వరసగా ఓడిపోతూనే ఉన్నాం, ఇలా ఎందుకు జరుగుతోందని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లిన పీసీసీ, మాజీ పీసీసీ, సీఎల్పీ నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ప్రతిసారీ చేసిన తప్పులే రిపీట్‌ అవుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్‌ మీద సింపతీ ఉందని, కానీ మారాల్సింది మా పార్టీ నేతలేనని ఆయన అన్నారు. మా పార్టీని ప్రక్షాళన చేసుకోవాలని, పార్టీ మారాలంటే ధైర్యం కావాలి, కానీ నాకా ధైర్యం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీని బాగు చేసుకోవాలని, పాత తరం, కొత్త తరం కలిసి పని చేస్తేనే విజయం సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version