KomatiReddy Rajagopal Reddy: కాంగ్రెస్‌లో ఘోర అవమానం జరిగింది.. రాజీనామాకు రెడీ..!

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఓవైపు బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటూనే.. మరోవైపు.. నియోజకవర్గంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే దానిపై ఆరా తీస్తున్నారు రాజగోపాల్ రెడ్డి.. ఇక, రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న పార్టీ అధిష్టానం సస్పెండ్‌ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ నివాసంలో ఠాగూర్‌, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై.. షోకాజ్‌ నోటీసులు ఇద్దామా? పార్టీ నుంచి సస్పెండ్‌ చేద్దామా? అనే చర్చలు జరుపుతున్నారు.. అయితే, హైదరాబాద్‌లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో సమావేశమైన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. రేపటి నుంచి రాజీనామా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ తోనే నిర్ణయం తీసుకుందామని సూచించారు.. మూడున్నరేళ్లుగా మునుగోడు అభివృద్ధి చేయలేక పోయాం…. ఉప ఎన్నిక వస్తేనైనా ప్రజలకు మేలు జరుగుతుందంటే రాజీనామా చేసేందుకు రెడీ అని ప్రకటించారు.

Read Also: West Bengal: ఇక, బెంగాల్‌ వంతు..? బీజేపీతో టచ్‌లోకి 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు..!

నిన్న చండూరు, మర్రిగూడ, నాంపల్లి, నేడు చౌటుప్పల్, మునుగోడు, నారాయణపురం మండలాలకు చెందిన అనుచరులతో సమావేశాలు నిర్వహించారు రాజగోపాల్‌రెడ్డి… బీజేపీ చేరిక, రాజీనామా అంశాలపై అనుచరుల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్న ఆయన.. ఈ సందర్భంగా కేడర్ తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నాకు ఘోర అవమానం జరిగింది… తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్ళను పక్కనపెట్టి, ద్రోహులకు పదవులివ్వడం ఆవేదనకు గురి చేసిందన్నారు.. టీఆర్ఎస్ హవాలోనూ మునుగోడులో ఘన విజయం సాదించా… టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా… ఎమ్మెల్సీగా గెలిపొందానని గుర్తుచేసిన ఆయన.. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా హై కమాండ్ లో చలనం లేదు… నేను సీఎల్పీ పదవిలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకునే వాడిని అన్నారు. ఇక, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు, ఇక భవిష్యత్ అంతా బీజేపీదేనని జోస్యం చెప్పిన ఆయన.. రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదు, గెలిచినోళ్లు ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదన్నారు.. సీఎం కేసీఆర్‌తోనే నా కొట్లాట.. కుటుంబ పాలనకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.