హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది ప్రభుత్వం.. హుజురాబాద్ కంటే ముందుగానే… సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలుకు పూనుకున్న సర్కార్.. ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసింది.. అయితే, దళిత బంధు ప్రకటించిన తర్వాత.. రకరకాల బంధులు తెరపైకి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి. హనుమంతరావు… దళితులకు దళిత బంధు ఇచ్చినట్టే… బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు..
ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు గుర్తుకు వస్తాయా..? అంటూ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు వి. హనుమంతరావు… అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ని రోజులు స్టేషన్లో పెడతారు? అని మండిపడ ఆయన.. వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట సర్కిల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.. దళిత బంధు పథకం ఇచ్చినట్టే.. బీసీలకు బీసీ బంధు ఇవ్వాలని.. బీసీ బంధు ఇవ్వకుంటే టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు వీహెచ్. కాగా, దళిత బంధు ప్రకటన తర్వాత.. వివిధ కులాలు తమకు కూడా ప్రత్యేక బంధు పథకం ద్వారా నిధులు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికే బీసీ బంధు గురించి ఆర్.కృష్ణయ్య లాంటి నేతలు కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.