KTR Tweet: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా ఏఐసీసీ అగ్రనేతలు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మూడు రోజుల బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయమని తెలిపారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అన్నారు. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని తెలిపారు. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదన్నారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని తెలిపారు.
కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీదని ట్విటర్ ద్వారా మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదన్నారు. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ..ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాదన్నారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిందన్నారు. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్., కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ?? అని ప్రశ్నించారు కేటీఆర్. దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను.. కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి..అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాదని అన్నారు. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు.. ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణమైందని తెలిపారు.
నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ అన్నారు. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్.. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు… రేవంత్ అని ఆగ్రహం వ్యాఖ్యలు చేశారు. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్.. అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని అన్నారు. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోందన్నారు. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని అన్నారు. వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరని మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.
Telangana Weather: నవంబర్ వరకు మండనున్న ఎండలు.. ఆ తర్వాతే చలి వాతావరణం