CM Revanth Reddy : వర్షాల వేళ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం హెచ్చరిక

  • అధికారులకు సీఎం వార్నింగ్
  • ప్రాజెక్టుల భద్రతపై ఫోకస్
  • యూరియా పంపిణీకి రైతు వేదికలు
  • క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే
Cm Revanth Redy

Cm Revanth Redy

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్, విద్యుత్ తదితర శాఖల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1న ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ, జూన్ 9 నాటి వర్షం సమరంలో అధికారులు సరిగా పనిచేయలేదని, మున్సిపల్ , పోలీస్ విభాగాల మధ్య సమన్వయ లోపం కనిపించిందని సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మానవ తప్పిదాల వల్ల ప్రజలకు సమస్యలు వస్తే అస్సలు సహించనని, అవసరమైతే తాను కూడా స్వయంగా రోడ్లపైకి వస్తానని స్పష్టం చేశారు. వర్షం పడినప్పుడు గత డేటా ఆధారంగా వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, , ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు.

ప్రాజెక్టుల భద్రత , రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, మెయింటెనెన్స్ అంతా నిబంధనల (మాన్యువల్) ప్రకారమే జరగాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణ కోసం తక్షణమే నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి .. ఇరిగేషన్ సీఈలు, ఎస్సీలు ఈ సీజన్ ముగిసేవరకు కచ్చితంగా స్థానికంగానే ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యస్థానాన్ని వదిలి వెళ్తే డిస్మిస్ చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డ్, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైతు వేదికలను యూరియా పంపిణీ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని, ఈ పంపిణీ బాధ్యతలను స్థానిక వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ, పారదర్శకత కోసం రెవిన్యూ సిబ్బందిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

×
×
Ad