NTV Telugu Site icon

CM Revanth Reddy: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం

Cmrevanthreddy

Cmrevanthreddy

ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఏ అండ్ యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు.

రంగారెడ్డి, హైదరాబాద్ మరియు మేడ్చల్‌.. మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు బుధవారం ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తారో తెలియజేయనున్నారు. ముందుగా రివర్ బెడ్‌‌లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు బుధవారం ప్రారంభించనున్నారు.