CM Revanth Reddy : హైడ్రా (HYDRAA) వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా స్పందించారు. చెరువులు, నాలాలు, పార్కులు , ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కబ్జాదారులు తప్పుడు పత్రాలతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో హైడ్రా ఒకటని, దానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని స్పష్టం చేశారు.
కోర్టు ధిక్కరణ కేసులు కొత్తేమీ కాదు
అధికారులపై కోర్టు ధిక్కరణ (Contempt) కేసులు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై ఏకంగా 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉండేవి అని, ఆనాడు దీనిపై ఎవరూ మాట్లాడలేదని గుర్తుచేశారు. కంటెంట్ కేసులు పడినంత మాత్రాన అధికారులను మార్చాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలి, ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారమని, ఆ విచక్షణారాహిత్యాన్ని ఎవరూ గుంజుకోలేరని స్పష్టం చేశారు. తప్పుడు కేసుల విషయంలో తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ విశ్వాసం ఉందని, వాటిని చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు.
హైడ్రా లక్ష్యం బడా బాబుల ఆక్రమణల తొలగింపే
కబ్జాకోరులు, బిఆర్ఎస్ నేతలు మాత్రమే హైడ్రాను రద్దు చేయాలని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బతుకమ్మ కుంట లాంటి పవిత్రమైన చెరువులను సైతం గత ప్రభుత్వ నేతలు ఆక్రమించారని ఆరోపించారు. ముఖీమ్ అనే ఒక పెద్ద కబ్జాకోరు నుంచి భూములను ఖాళీ చేయించామని, హైడ్రా చర్యల వల్ల బడా బాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. చెరువులు, కుంటలు, నాలాలు , ప్రభుత్వ భూములను కాపాడటమే హైడ్రా పని అని, ఆ పనిని సంస్థ అత్యంత పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తోందని ప్రశంసించారు.
సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై ఆగ్రహం
హైడ్రాను నిరోధించడానికి , ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొందరు డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ప్రజలు ఇలాంటి కుట్రలకు సహకరించవద్దని కోరారు. హైడ్రా కార్యాచరణ, అది నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని పునరుద్ఘాటించారు.
కోర్టు ఆదేశాలపై సమీక్షించి ముందడుగు
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని తాను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, త్వరలోనే ప్రభుత్వపరంగా దీనిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. న్యాయస్థానాలంటే తమకు గౌరవం ఉందని, కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే హైడ్రా ద్వారా చేపడుతున్న పర్యావరణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

