హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో పాలనను మరింత పారదర్శకంగా, టెక్నాలజీ ఆధారితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేశారు. అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం , భద్రతపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి హోటల్ కిచెన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటిని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు. దీనివల్ల ఆహార తయారీలో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించవచ్చని, హోటళ్లకు రేటింగ్ , సర్టిఫికేషన్ ఇచ్చే విధానం ద్వారా వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు నాకు మోరల్ విక్టరీ
నగర జీవన ప్రమాణాలను పెంచడంలో భాగంగా శానిటేషన్ , దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. మున్సిపల్ అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రతి స్ట్రీట్ లైట్కు ఒక ప్రత్యేక నంబర్ కేటాయించి, వాటన్నింటినీ ఒక సెంట్రల్ డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు టెక్నాలజీ ద్వారా తక్షణమే పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు చీకటి వీధుల భయం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణ , వర్షపు నీటి నిల్వపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ప్రధాన సిగ్నల్ జంక్షన్లు, సర్కిళ్లలో వర్షపు నీరు వృథా కాకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ (ఇకుడు గుంతలు) ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టును తొలుత కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి, ఆపై నగరం అంతటా విస్తరించాలని అధికారులకు సూచించారు. అలాగే ఫైర్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరికరాలను వినియోగించాలని ఆదేశించారు. మొత్తం మీద టెక్నాలజీ సహాయంతో సమస్యలను గుర్తించి, క్షేత్రస్థాయిలో వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
US-Iran Tension: “ఇజ్రాయిల్ వదిలి వెళ్లండి”.. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య అమెరికా హెచ్చరిక..
