బుర్ర ఉండా.. లేకనా.. తెలివి ఉందా.. లేకనా.. శక్తి సామర్థ్యత ఉండా.. లేక అసమర్థతోనా.. వివేకం ఉందా.. లేక అవివేకమా.. అంటూ టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదులలో ఉన్నటువంటి నీటి లభ్యత 65 వేల టీఎంసీలు అని, ఇంకా 4-5 వేల టీఎంసీలు నీళ్లు టిబెట్ నుంచి రావాల్సి ఉందని, దానిపై ఇంకా లెక్కలు తేలలేదన్నారు. ఇప్పటికే లెక్కించబడి ఉన్న 65 వేల టీఎంసీల నుంచి దేశం కేవలం 29 వేల టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటోందన్నారు.
కానీ ఎక్కడ చూసినా.. దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కావేరి జలాల కోసం తమిళనాడు, కర్ణాటక, సింధూ నది జలాల కోసం పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ప్రతి రోజు యుద్ధం చేస్తున్నాయన్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం ఈ దేశానికి.. కనీసం తాగునీళ్లకు నోచుకోదా భారతదేశం..? అని ప్రశ్నించారు. తాగునీరు, సాగునీరు, కరెంటు లేదు.. కానీ ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
