CM KCR Meeting On Heavy Rains And Floods In Telangana: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశాలు ఇవ్వడంతోపాటు పరిస్థితులపై ఆరా తీశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయమని.. కష్టకాలంలో ప్రజలను కాపాడుకోవడం కోసం సంబంధిత శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని, ఎవరూ ఉద్యోగ కేంద్రాలని వదిలి వెళ్లకూడదని సూచించారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను కేసీఆర్ ఆదేశించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఇప్పుడు కురిసే వర్షాలతో గోదావరి నది ఎల్లుండి వరకు ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని కేసఆర్ హెచ్చరించారు. కాబట్టి.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే.. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదలశాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు ప్రాజెక్టుల పరిస్థితులను, వరదలు ఎలా వస్తున్నాయనే విషయాలను కేసీఆర్కు వివరించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ వరదలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మొన్నటికంటే ఎక్కువ వరదలొచ్చే ప్రమాదం ఉందన్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలున్నాయని.. నదులు, ఉప నదులు ఉప్పొంగుతున్నాయన్నారు.
