Cheyutha Pension : తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద నూతన పింఛన్ల (చేయూత పెన్షన్లు) దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రోజు పొడిగించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో లబ్ధిదారులు రేపు సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటు కలిగింది. పూర్వపు షెడ్యూల్ ప్రకారం చేయూత నూతన పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియాల్సి ఉంది. అయితే, వరుసగా మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు రావడంతో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సకాలంలో దరఖాస్తులు అందజేయలేకపోయామని పలువురు విజ్ఞప్తి చేయడంతో, లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గడువును మరో రోజు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును రేపు సాయంత్రం వరకు పొడిగిస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉండి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

