Central Team: కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైన భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని పంపనున్నట్లు తెలిపారు. ఈరోజు తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన ఈ బృందం రేపు కాళేశ్వరం డ్యామ్ను సందర్శించనుంది.
మేడిగడ్డ స్తంభాలు కుంగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 6వ బ్లాక్లోని 15 నుంచి 20వ నంబర్ గేటు కూలిపోయింది. బ్యారేజీ 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. సాగునీటి కోసం నిల్వ ఉన్న నీరంతా వృథాగా పడేయాల్సి వచ్చిందన్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు రాత్రంతా భయాందోళనలతో గడిపినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై లేవనెత్తిన ప్రశ్నలకు స్పందిస్తూ.. దయచేసి కేంద్ర బృందాన్ని పంపి పరీక్షలు నిర్వహించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించిన కొన్ని కీలకమైన అంశాలు..
1. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని.. భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులను గమనించారా?
2. పిల్లర్ల కింద వేసిన ఫౌండేషన్ (పియర్స్) నాణ్యతతో నిర్మించలేదని స్పష్టమైంది. దీన్ని బట్టి.. పియర్స్ నిర్మించే సమయంలో అక్కడ సాయిల్ ట్రీట్మెంట్ జరగలేదనేది అర్థమవుతోంది. అంటే.. ఫౌండేషన్ ఇన్స్పెక్షన్ వైఫల్యం కారణంగానే.. ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టమైంది.
3. ప్రాజెక్టు డిజైనింగ్ బాధ్యతను.. EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ & కన్స్ట్రక్షన్) మెథడ్లో.. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ కంపెనీ చేసిందా? లేక రాష్ట్ర నీటిపారుదల విభాగానికి చెందిన CDO (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) ద్వారా చేయించారా?.
ఈ తాజా పరిస్థితికి ఎవరు బాధ్యులనే విషయాన్ని తేల్చగలరు. గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు’లో భాగంగా.. ‘కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ’.. నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నానని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Nata Simham Rampage: ఓవర్సీస్ లో బాలయ్య మాత్రమే సాధించిన ఘనత ఇది…