Blood Donors Honourned In Raj Bhavan By Chiranjeevi and Tamilisai: చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్భవన్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘చిరు భద్రతా కార్డు’లను గవర్నర్ తమిళిసై అందజేశారు. రక్తదాతలను సత్కరించి.. లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలపై గవర్నర్, చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిరు మాట్లాడుతూ.. 1998లో తాను బ్లడ్ బ్యాంక్ ప్రారంభించానని, దాని వెనుక ఎంతో కృషి ఉందని అన్నారు. ఆ రోజుల్లో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉండేదని, రక్తదానం చేసే వాళ్లు తక్కువ మందే ఉండేవారన్నారు. అప్పుడు తనకు బ్లడ్ బ్యాంక్ ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చిందని, అందుకు తన ఫ్యాన్స్ కూడా సహకరించారని చెప్పారు. ఫ్యాన్స్గా నా సినిమాలు చూడటం, నన్ను కలవడం, ఫోటోలు దిగడం కంటే.. రక్తదానం చేయడమే తనకు ఎక్కువ సంతోషాన్నిస్తుందని తెలిపారు. రక్తదానం చేస్తున్న ప్రతీ అభిమానికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఇక కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభించినప్పుడు, సినీ కార్మికులకు సరుకులు అందిస్తున్నప్పుడు, తనని ప్రోత్సాహించిన మొదటి వ్యక్తి గవర్నర్ అని చిరంజీవి పేర్కొన్నారు. గవర్నర్ ఎన్నోసార్లు ట్వీట్ చేసి, ఎంకరేజ్ చేశారన్నారు.
అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు. తాను హౌజ్ సర్జన్గా ఉన్నప్పుడు, తమ కుటుంబంలోనే ఒకరికి రక్తం అత్యవసరమైందని.. ఆ టైంలో పేషెంట్ని చూసేందుకు చాలామంది వచ్చారని అన్నారు. అప్పుడు ఆ పేషెంట్కి రక్తం కావాలన్నానని, ఎవరైనా దానం చేస్తారా అని అడిగానని, అలా అడిగే సరికి అందరూ అక్కడి నుంచి జారుకున్నారని వెల్లడించారు. రక్తదానం అంత సులువు కాదని, ఒక డాక్టర్గా తాను ఎన్నో సంఘటనలు చూశానని పేర్కొన్నారు. రక్తం దొరక్క చనిపోయిన పేషెంట్స్ని చూశానని, రక్తం దొరకడం వల్ల ప్రాణాలతో బయటపడిన వాళ్లనూ చూశానని తమిళిసై చెప్పుకొచ్చారు.
