Site icon NTV Telugu

హుజురాబాద్‌ జోష్.. బీజేపీ సంబరాలు షురూ

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపాయి.. మొదటి నుంచి తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయంపై నమ్మకంతో ఉన్నాయి పార్టీ శ్రేణులు.. అంతకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. ఇక, రౌండ్‌ రౌండ్‌కు ఈటల రాజేందర్‌ లీడ్‌ పెరిగిపోతూనే ఉంది.. 15 రౌండ్‌ ముగిసేసరికి ఆయన ఆధిక్యం 11 వేలను క్రాస్‌ చేసింది.. ఇక, ఈటల రాజేందర్‌కు పట్టున్న ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్లను లెక్కించాల్సి ఉండడంతో.. బీజేపీ విజయం దాదాపు ఖరారైపోయిందంటున్నారు. మరోవైపు.. ఈ ఫలితాలతో కమలం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు..

దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో ఆ పార్టీలో కొత్త జోష్‌ రాగా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు.. వారిలో మరింత నమ్మకాన్ని పెంచాయి.. అయితే, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైనా.. ఇప్పుడు హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితం మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపింది. కరీంనగర్‌, హుజురాబాద్‌, హన్మకొండ జిల్లా, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నాయి.. రంగులు చల్లుకుని, టపాసులు కాల్చి విజయోత్సవన్నీ జరుపుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు.

Exit mobile version