మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించాల్సింది పోయి, ఓటమిని జీర్ణించుకోలేని కొందరు అభ్యర్థులు ఏకంగా ఓటర్లపైనే దాడులకు దిగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి స్వరూపరాణి ఓటమి పాలయ్యారు. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె , ఆమె కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ వార్డులో తీవ్ర హంగామా సృష్టించారు. స్థానిక ఓటర్ల ఇళ్లపై ఖాళీ బీరు సీసాలతో దాడికి దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ వీధిలో బీభత్సం సృష్టించడంతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Tejas Thackeray: మాజీ సీఎం కుమారుడికి సీరియస్..
అభ్యర్థి వర్గం చేసిన దాడులకు వార్డులోని మహిళలు కూడా అంతే ధీటుగా స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రలోభాల్లో భాగంగా అభ్యర్థి తమకు పంచిన చీరలను, హాట్ బాక్సులను తీసుకువచ్చి రోడ్డుపైకి విసిరివేస్తూ నిరసన తెలిపారు. “ఓట్లు వేయలేదని దాడులు చేస్తారా? మీ గిఫ్టులు మాకు వద్దు” అంటూ మహిళలు అభ్యర్థి తీరును తీవ్రంగా ఎండగట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించకుండా ఇలా దాడులకు దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.