Bhatti Vikramarka : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘రైతు ఆశీర్వాద సభ’ సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ ముఖ్య సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్, రాష్ట్ర కళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు నూత సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం , కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జూన్ 30న సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’
మధిర నియోజకవర్గం, చింతకాని మండలం జగన్నాధపురంలో జూన్ 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరగనుందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ‘రైతు ఆశీర్వాద సభ’ను నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు , రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. కాళేశ్వరం కృంగిపోయింది!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను తీవ్ర అప్పుల రాష్ట్రంగా మార్చారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు నేటికీ ఎంతో బలంగా, చెక్కుచెదరకుండా ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం పదేళ్లలోనే కృంగిపోయిందని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలతో సహా చెల్లిస్తోందని, ఇప్పటివరకు కేసీఆర్ చేసిన అప్పుల కోసం రూ. 76 వేల కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు మాయమాటలతో రాష్ట్రంలో తిరుగుతున్నారని, ప్రజలెవరూ వారి మాటలను నమ్మవద్దని కోరారు.
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాల అమలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తాము ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కోటి పది లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని, ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు, నిరుపేదల కోసం రూ. 22 వేల కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం కోసం ఇప్పటికే రూ. 13 వేల కోట్లు చెల్లించామని వివరించారు. అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద కూడా వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేశామని ఆయన వెల్లడించారు.
ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి
కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన కొన్ని నూతన ప్రోగ్రామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటు హక్కు ఎంతో విలువైనదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) ప్రజల వద్దకు వెళ్లి ఓటు హక్కుపై సమగ్రమైన అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి కూడా ఓటర్లకు సంబంధించిన పూర్తి, సమగ్రమైన సమాచారాన్ని అందించాలని, జూన్ 30న జరిగే రైతు ఆశీర్వాద సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

