Bhatti Vikramarka : డ్రగ్స్‌పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!

  • శిల్పకళా వేదికలో యాంటీ డ్రగ్స్ దినోత్సవం
  • డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
  • పోలీసులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్.. విద్యార్థుల్లో అవగాహన
  • సినీ పరిశ్రమకు భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి
Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ శిల్పకళా వేదికలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ (International Anti-Drugs Day) వేడుకలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు. యువతను డ్రగ్స్ మహమ్మారి బారి నుంచి రక్షించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ నుండి హీరో రామ్ పోతినేని, హీరోయిన్ మీనాక్షి చౌదరి, ప్రముఖ జిమ్నాస్ట్ బుద్ధా అరుణా రెడ్డిలు పాల్గొని సందడి చేశారు.

డ్రగ్స్ రహిత తెలంగాణే మా ధ్యేయం

కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ మహమ్మారి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అందరం కలిసికట్టుగా పోరాడినప్పుడే డ్రగ్స్ లేని సమాజాన్ని సాధించగలమని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ను అరికట్టడానికి ప్రత్యేకంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్‌కు ఆర్థికంగా ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకునే తల్లిదండ్రుల ఆశ, రాష్ట్ర ప్రభుత్వ కల ఒక్కటేనని.. అది యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండటమేనని ఉద్ఘాటించారు.

రిస్క్‌లో పనిచేసే పోలీసులకు ఇన్సెంటివ్స్.. విద్యాసంస్థల్లో అవగాహన

డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రాణాలకు తెగించి, నిరంతరం రిస్క్‌లో పనిచేస్తున్న పోలీస్ అధికారుల, సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే అలాంటి ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని నమ్ముతూ, డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక అవేర్‌నెస్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా విద్యావ్యవస్థ బలోపేతం, రాష్ట్ర రక్షణ విషయాలలో ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు: సినిమా రంగానికి విజ్ఞప్తి

డ్రగ్స్ రవాణా లేదా వినియోగంలో ఎంతటి పెద్దవారు, ఎంతటి ప్రభావశీలురు ఉన్నా సరే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని భట్టి విక్రమార్క తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చలనచిత్ర రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, ఇతర కళాకారులు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని శిల్పకళా వేదిక నుంచి ఆయన విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమలో ఉన్నవారు కూడా సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలని కోరారు.

చట్టాలతో పాటు సమాజంలో పరివర్తన రావాలి

ప్రభుత్వం తరఫున కఠినమైన చట్టాలు చేస్తున్నప్పటికీ, ప్రజల్లో మార్పు రానంతవరకు ఆశించిన ఫలితాలు రావని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. దేశంలో వరకట్న నిషేధ చట్టం ఉన్నప్పటికీ, అది ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడానికి సామాజిక మార్పు లోపించడమే కారణమని ఉదాహరించారు. డ్రగ్స్ నిర్మూలన వంటి కఠినమైన చట్టాలు వంద శాతం విజయవంతం కావాలంటే, చట్టాలతో పాటు సమాజంలో, ప్రజల ఆలోచనా విధానంలో స్పష్టమైన పరివర్తన రావాలని ఆయన ఆకాంక్షించారు.