తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలపై సమర శంఖం పూరిస్తోంది. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడంతో వెయ్యి కోట్ల బకాయి ఉంది. నేడు రైతుల పొలాలకు కరెంట్ లేక ఎండబెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఎంఐఎం నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు నేను చెబుతున్నా…. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాతబస్తీలో 15 నిమిషాలు విద్యుత్ సిబ్బందిని అప్పగిస్తాం. గల్లీగల్లీని జల్లెడ పట్టిస్తం. పాత బకాయిలతో సహా విద్యుత్ బిల్లులను వసూలు చేయిస్తాం. నేను నా దేశం, హిందూ ధర్మం కోసం బరాబర్ పనిచేస్తా అన్నారు బండి సంజయ్.
కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.6 వేల కోట్ల భారం మోపిండు. వచ్చే మే నెల నుండి కరెంట్ బిల్లులు రెట్టింపు కాబోతున్నయ్. డిస్కంలకు రూ.60 వేల కోట్ల బకాయి ఉన్న కేసీఆర్ వాటిని పూర్తి సంక్షోభంలోకి నెట్టేసిన ఘనుడు కేసీఆర్. ఓట్లు, సీట్లు కొనేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ రైతులు పండించిన వరి ధాన్యం మాత్రం కొనబోమని చెబుతూ రైతులను నట్టేట ముంచుతున్నడు. మేం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. కేంద్రం ధాన్యం కొనేందుకు డబ్బులు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నా…. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండికేస్తూ రాజకీయం చేస్తోందని కందుకూరు సభలో మండిపడ్డారు.
టీఆర్ఎస్ దుర్మార్గాలపై పోరాడుతున్నం. ఈ పోరాటంలో బీజేపీ కార్యకర్తలు జైలు పాలైతున్నరు. కేసులు ఎదుర్కొంటున్నరు. లాఠీదెబ్బలు తింటున్నరు. తినడానికి తిండి లేకపోయినా కుటుంబాలను పక్కనపెట్టి పార్టీ జెండా పట్టుకుని ప్రజల కోసం పోరాడుతున్న కార్యకర్తలు బీజేపీకే సొంతం. నేటికీ వందలాది మంది కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. కార్యకర్తలను పరామర్శించడానికి బైంసా వెళుతున్న బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు… ఓవైసీ వెళితే మాత్రం స్వాగతం పలుకుతూ అడుగులకు మడుగులొత్తుతుండటం సిగ్గు చేటు.
బైంసాలో 12 మంది కార్యకర్తల ఇళ్ళను కొందరు లుచ్చాలు తగలబెడితే ఒక్క పైసా కూడా సాయం చేయని మూర్ఖపు ప్రభుత్వం కేసీఆర్ దే.. కానీ వాళ్లకు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటూ ఇళ్లు కట్టించింది. తెలంగాణలో హిందువులందరినీ ఓటు బ్యాంకుగా మార్చి హిందూ సమాజం దమ్ము చూపిస్తాం. ఎవడైతే మా అడ్డా అనుకుంటున్నడో పాతబస్తీకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలని ఎవరైతే సవాల్ విసిరిండో…. ఆ సవాల్ ను స్వీకరించి టైం, డేట్ చెప్పి పాతబస్తీ అడ్డాకు వెళ్లి సభ పెట్టి దమ్ము చూపిన పార్టీ బీజేపీ.
బండి సంజయ్ మాట్లాడితే మతతత్వమని చెప్పే టీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు కొమ్ముకాస్తూ లౌకిక వాదులని చెప్పుకోవడం సిగ్గు చేటు. నేడు ప్రతి నోటా హిందువులమని సగర్వంగా చెప్పుకునేలా చేసిన ఘనత బీజేపీ కార్యకర్తలదే. కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేంది? ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నదా? కేసులు ఎదుర్కొన్నదా? జైలుకు పోయిందా? కేసీఆర్ ఫాలనను చూసి అమరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్. ఆనాడు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగితే వెళ్లకుండా తాగి పడుకున్న ఘనుడు కేసీఆర్. ఆనాడు తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ గొంతెత్తితే తెలంగాణ సాధ్యమైంది.
తెలంగాణలో అమరుల ఆశయాలకు భిన్నంగా నయా నిజాం పాలన సాగుతోంది. నియంత, అవినీతి పాలన సాగుతోంది. తెలంగాణ తల్లి గడీల్లో బందీగా మారి తల్లడిల్లుతోంది. కేసీఆర్ మూర్ఖపు పాలన నుండి బంధ విముక్తిరాలిని చేయాలంటూ వేడుకుంటోంది. అందుకే బీజేపీ కార్యకర్తలు కాషాయ జెండా ఎత్తి పోరాడుతున్నరు. కేసీఆర్ పాలనను కూల్చి గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసేందుకు ఉద్యమిస్తాం అన్నారు బండి సంజయ్.
ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను ప్రగతి భవన్ కు, అక్కడి నుండి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన ఘనత బీజేపీ కార్యకర్తలదే. ఆ తరువాత కేసీఆర్ ను దేశమంతటా దిక్కుతోచని విధంగా తిరిగేలా చేసిన ఘనత కూడా కమలం పార్టీ కార్యకర్తలదే. ఇకపై కేసీఆర్ ను అడుగడుగునా అడ్డుకుని తీరుతాం. ఇదే చివరి ఉద్యమం కావాలి. అందుకోసం మీరంతా మరో ఏడాదిపాటు పూర్తి సమయాన్ని బీజేపీకి ఇవ్వండి. అందరం కలిసి ఏకమై కేసీఆర్ పాలనను గద్దె దించి తీరుతాం.
అందులో భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న రెండో విడత పాదయాత్ర ప్రారంభించబోతున్నం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేయాలని చూస్తున్న కేసీఆర్ రాష్ట్రంలో ముస్లింలకు 14 శాతం రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర చేస్తున్నాడు. మైనారిటీ సంతుష్ట విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ సాగిస్తున్న ఈ మహోద్యమంలో మీరంతా కలిసి రావాలని కోరుతున్నా అన్నారు బండి సంజయ్.