రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక విద్యాసంస్థలకు కనీస బకాయిలు చెల్లించడం చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విదేశీ విశ్వవిద్యాలయాలను రప్పిస్తామనడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ. 15 వేల కోట్లకు చేరుకోవడంతో వేలాది ప్రైవేట్ కళాశాలలు మూతపడే స్థితికి చేరుకున్నాయని, లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని బండి సంజయ్ పేర్కొన్నారు. వీరిలో అత్యధికులు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారేనని, ఫీజు రీయంబర్స్మెంట్ నిలిచిపోవడంతో వీరంతా ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. బకాయిలు రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని, దీంతో విద్యార్థులు పైచదువులకు వెళ్లలేక, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు వివక్షను, అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు.
మాట తప్పడంలో బీఆర్ఎస్ను మించిపోయిన కాంగ్రెస్
వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) కింద ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలన్నీ చెల్లిస్తామని, నిర్ణీత వ్యవధిలోనే నిధులు విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. హామీలిచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించిపోయిందని విమర్శించారు. కళాశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చుకోలేక, మెయింటెనెన్స్ చార్జీలు భరించలేక తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, ఫీజులు అడిగితే బెదిరింపులకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని హితవు చెప్పారు.
“ఫీజు బకాయి – బీజేపీ లడాయి”.. పోరాటం ఉధృతం చేస్తాం
ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేపట్టిన ‘‘ఫీజు బకాయి – బీజేపీ లడాయి’’ దీక్షకు బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజా సంఘాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ. 15 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో రామచంద్రరావు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచేదాకా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

