బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వైస్ ఛాన్సలర్ను వెంటనే నియమించి, విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బాసర ట్రిపుల్ ఐటీ లోపల చేసిన శాంతియుత పోరాటాన్ని పోలీసులు భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్ ఐటీలో శాశ్వత వీసి లేనందున అక్కడి విద్యార్థులు నిత్యం సమస్యల ఉబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీకి వెంటనే శాశ్వత వైస్ ఛాన్సలర్ ని నియమించి అదే విధంగా బాసర ట్రిపుల్ ఐటీ లోని కరెంట్ కోతలు, మంచి నీటి కొరత, నాణ్యత లేని ఆహార సమస్యలపై వెంటనే దృష్టి సారించాలన్నారు. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం వైస్ ఛాన్సలర్ నియామకంలో జరుగుతున్న జాప్యమేనని,కావున బాసర ట్రిపుల్ ఐటీకి వెంటనే శాశ్వత వైస్ ఛాన్సలర్ ని నియమించి అక్కడ విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా వెంకట్ బల్మూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వేణు రాజు, ఎన్ఎస్యూఐ నాయకులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.