Congress Key Meeting: తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ( శుక్రవారం ) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరకు పీసీసీ పదవిని ఎస్టీలకు ఇవ్వలేదనే వాదనపై కూడా సమావేశంలోజరగనున్న చర్చ జరగనుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఈరోజు తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే.. కొత్త అధ్యక్షుడు నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కాగా, పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కీలక సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ పాల్గొననున్నారు. ఇక, పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోనుంది. సామాజిక సమీకరణలు, ఇతరత్రా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
