తెలంగాణ శాసనసభలో 22 A నిబంధనలు, రెవెన్యూ సమస్యలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష BRS తీరుపై, గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు 125 సంవత్సరాల తర్వాత రెవెన్యూ శాఖలో తమ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఆయన ప్రకటిస్తూనే, గత పదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు సభలో ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ప్రతిపక్ష నాయకులు ఉద్దేశపూర్వకంగా పారిపోయారని ఎద్దేవా చేశారు. వాళ్లు సభ నుంచి వెళ్లిపోయినా, తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు నిజానిజాలు వెల్లడించాల్సిన గురుతర బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
గతంలో తీసుకొచ్చిన ‘ధరణి’ చట్టం ప్రజల సంక్షేమం కోసం కాకుండా, కేవలం పింక్ కలర్ షర్టులు వేసుకున్న ఆ పార్టీ నాయకులకు, కేడర్కు లబ్ధి చేకూర్చడానికే దోహదపడిందని మంత్రి ఆరోపించారు. అప్పట్లో రెవెన్యూ శాఖకు మంత్రి ఉన్నప్పటికీ, ఆ శాఖపై పూర్తి నియంత్రణను సీఎం మాత్రమే ఉంచుకున్నారని, కేవలం నలుగురు వ్యక్తులు మూసివేసిన గదుల్లో కూర్చొని ఈ చట్టాన్ని రూపొందించారని విమర్శించారు. అంతటి కీలకమైన రెవెన్యూ డేటాను, ధరణి కాంట్రాక్టును తమ తొత్తులైన విదేశీ సంస్థలకు అప్పగించి, ఆ తర్వాత మరొక ప్రైవేటు కంపెనీకి బదిలీ చేస్తూ ప్రజల సమాచారాన్ని ప్రమాదంలో పడేశారని తెలిపారు. గతంలో BRS ఎమ్మెల్యేలు సైతం సభలో ఈ ధరణి లోపాలపై నిరసన వ్యక్తం చేసినప్పటికీ, నాటి ప్రభుత్వం గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటూ వారి మాటలను కనీసం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
ధరణి తీసుకొచ్చిన లోపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సొంత భూములను అమ్ముకోలేక నిజామాబాద్ జిల్లాకు చెందిన కుంట రాజేష్, సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండలానికి చెందిన కృష్ణయ్య అనే రైతులు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు తమకు, తమ కుటుంబ సభ్యులకు చెందిన లక్షలాది ఎకరాల భూములు ఇతరులకు కనపడకుండా ధరణిలో ‘సీక్రెట్ లాక్స్’, ‘ప్రైవసీ’ ఆప్షన్లు పెట్టుకున్నారని, సామాన్య ప్రజల భూములను మాత్రం సమస్యల సుడిగుండంలోకి నెట్టి రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వారికి ఒక నిబంధన, సామాన్యులకు మరొక నిబంధన అమలు చేయడమే కాకుండా, కనీసం అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్పీల్ చేసుకునే హక్కును కూడా రైతులకు లేకుండా చేశారని పేర్కొన్నారు.
అంతేకాకుండా, వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలు నాటి పెద్దలు చెప్పినట్లు వినలేదనే నెపంతో, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండానే ఆ వ్యవస్థలను రద్దు చేశారని గుర్తుచేశారు. అయితే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ వ్యవస్థలను పునరుద్ధరించామని చెప్పారు. గతంలో ధరణి లోపాల వల్ల నష్టపోయిన 2.46 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా, భూభారతి ప్రతిపాదనల తర్వాత ఆ సంఖ్య 5.46 లక్షలకు చేరిందని వెల్లడించారు. గత ప్రభుత్వం లాగా అర్జీలను కారణం లేకుండా తిరస్కరించడం కాకుండా, తమ ప్రభుత్వం ఆ దరఖాస్తులన్నింటినీ అత్యంత పారదర్శకంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

