USB condom: నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైన వస్తువులలో స్మార్ట్ఫోన్లు ముందు వరుసలో ఉంటున్నాయి. మనం తరచుగా మన ఫోన్లను రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్ వంటి ప్రదేశాలలో పబ్లిక్ USB పోర్ట్లను ఉపయోగించి ఛార్జ్ చేస్తాము. కానీ ఇది మనకు తీవ్రమైన ప్రమాదాన్ని తీసుకువస్తుందని మీలో ఎంత మందికి తెలుసు. నిజానికి ఈ పబ్లిక్ USB పోర్ట్ల ద్వారా మీ బ్యాంక్ డేటా, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి రక్షించడానికి USB కండోమ్స్ వస్తున్నాయి. ఈ స్టోరీలో USB కండోమ్స్ అంటే ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
READ ALSO: Uttam Kumar Reddy : వరద జలాల పేరుతో వాడడానికి వీలులేదు
USB కండోమ్ అంటే..
USB కండోమ్ అనేది ఒక చిన్న USB డేటా బ్లాకర్. ఇది ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్కు – ఛార్జింగ్ పోర్ట్ మధ్య అమర్చబడి ఉంటుంది. పబ్లిక్ ప్లేస్లో ఛార్జింగ్ చేసేటప్పుడు ఈ పరికరం చాలా కీలకంగా మారుతుంది. ఇది మీ ఫోన్కు ఛార్జింగ్ అందిస్తుంది కానీ, మీ ఫోన్ నుంచి ఎలాంటి డేటాను బదిలీ కాకుండా పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అంటే మీ ఫోన్ ఛార్జ్ అవుతుంది కానీ ఎలాంటి జ్యూస్ జాకింగ్కు ఆస్కారం ఉండదు. దీంతో మీ ఫోన్ నుంచి ఎటువంటి ఫైల్లు, పాస్వర్డ్లు లేదా సమాచారం బయటకు వెళ్లవు. నిజానికి ఈ పరికరం చాలా చిన్నది, మీ జేబులో లేదంటే, దీనిని మీ బ్యాగ్లో తీసుకెళ్లడం చాలా సులభం. భారతదేశంలో దీని ధర వచ్చేసి రూ.500 నుంచి రూ.1000 మధ్యలో ఉంటుంది.

జ్యూస్ జాకింగ్ అంటే..
జ్యూస్ జాకింగ్ అనేది సైబర్ దాడి. దీనిలో హ్యాకర్లు మాల్వేర్ను పబ్లిక్ USB పోర్ట్ లేదా కేబుల్లోకి చొప్పిస్తారు. జ్యూస్ జాకింగ్కు గురైన USB పోర్ట్ లేదా కేబుల్కు మీరు మీ ఫోన్ను ప్లగ్ చేస్తే, వెంటనే మీ బ్యాంక్ డేటా, OTPలు, ఇమెయిల్ చిరునామాలు, పాస్వర్డ్లు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తాయి. దీని గురించి RBI కూడా హెచ్చరిక జారీ చేసింది. సైబర్ దాడికి గురైన ఫోన్లు చాలా సందర్భాలలో పూర్తిగా లాక్ అవుతాయి లేదా మీ అకౌంట్లు పూర్తిగా ఖాళీ అవుతాయి. వాస్తవానికి సైబర్ ముప్పు అనేది మనకు కనిపించదు, కానీ గణనీయమైన నష్టాన్ని మాత్రం కలిగిస్తుంది.
ఎలా పని చేస్తుందంటే..
USB కండోమ్ మీ ఛార్జర్ – మీ ఫోన్ మధ్య అమర్చబడి ఉంటుంది. ఇది మీ ఫోన్లోకి కేవలం ఛార్జింగ్ కోసం విద్యుత్తును మాత్రమే తీసుకొని వస్తుంది. ఇది డేటా లైన్ను ఆపివేస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఇది ఉపయోగిస్తే మీ ఫోన్కు ఛార్జింగ్ ఎక్కుకుంది, కానీ ఏ యాప్లు, హ్యాకర్లు లేదా సాఫ్ట్వేర్ మీ ఫోన్కు కనెక్ట్ కాలేవు. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా టాబ్లెట్లు, ల్యాప్టాప్లు, USB-C పరికరాల్లో కూడా పనిచేస్తుంది. కొన్ని కేబుల్లు అంతర్నిర్మిత డేటా బ్లాకింగ్తో కూడా వస్తాయి.
USB కండోమ్ అవసరమా..
తరచుగా జ్యూస్ జాకింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికి ఆండ్రాయిడ్, ఐఫోన్ పరికరాలకు అంతర్నిర్మిత రక్షణ ఉన్నప్పటికీ, జ్యూస్ జాకింగ్ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటే లేదా తరచుగా పబ్లిక్ ఛార్జింగ్ పోర్టులను ఉపయోగిస్తుంటే, USB కండోమ్ మీకు ఈ సమస్య నుంచి మంచి రక్షణ అందిస్తాయని చెబుతున్నారు. అయితే మీరు మీ సొంత ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ని ఉపయోగిస్తే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొన్నారు.
READ ALSO: Chiranjeevi – Anil Ravipudi: బ్లాక్ బస్టర్ వరప్రసాద్.. మెగా హగ్ వైరల్