Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్‌కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Rishabh Agarwal

Rishabh Agarwal

Rishabh Agarwal: మెటా (Meta) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడానికి మిలియన్ల కొద్దీ డాలర్ల జీతాలతో భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి ఓ కళ్ళు చెదిరే ఆఫర్‌ను అందుకున్నాడు ఐఐటీ బాంబే (IIT Bombay) పూర్వ విద్యార్థి, భారతీయ ఏఐ పరిశోధకుడు రిషభ్ అగర్వాల్. కానీ.. ఆ కోట్లాది రూపాయల ప్యాకేజీని కాదని, సొంతంగా ఏఐ స్టార్టప్ నిర్మించేందుకు మెటా సంస్థ నుంచి బయటకు వచ్చేశారు.

ఇటీవల సోషల్ మీడియా యూజర్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ ఆసక్తికర కథనాన్ని పంచుకున్నారు. జేఈఈ (JEE) పరీక్షలో ఆల్ ఇండియా 33వ ర్యాంక్ సాధించి, ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదివిన రిషభ్ అగర్వాల్.. మెటాలో కేవలం కొన్ని నెలలు పనిచేసిన తర్వాత దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ. 8.5 కోట్లకు పైగా) ఉద్యోగాన్ని వదులుకున్నారని సదరు నెటిజన్ పోస్ట్ చేశారు. అయితే, ఈ వైరల్ పోస్ట్‌పై స్వయంగా రిషభ్ అగర్వాల్ స్పందిస్తూ ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. మెటా తనకు ఇచ్చిన ఆఫర్ మీరు చెబుతున్న 1 మిలియన్ డాలర్ల కంటే చాలా చాలా ఎక్కువని పేర్కొన్నారు. దీన్ని బట్టి మెటా అతనికి ఆఫర్ చేసిన ప్యాకేజీ ఊహకందని స్థాయిలో ఉందని అర్థమవుతోంది.

ఎవరీ రిషభ్ అగర్వాల్?

భారత్ అందించిన అత్యంత ప్రతిభావంతులైన ఏఐ పరిశోధకులలో రిషభ్ ఒకరు. ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసిన ఆయన.. కెనడాలోని మాంట్రియల్ బేస్డ్ ఏఐ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (Mila)లో ప్రముఖ పరిశోధకులు ఆరోన్ కోర్విల్లే, మార్క్ బెల్లెమారేల పర్యవేక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు. ఏఐ రంగంలోని దిగ్గజ సంస్థలైన గూగుల్ బ్రెయిన్ (Google Brain), గూగుల్ డీప్‌మైండ్ (Google DeepMind), వేమో (Waymo), మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో ఆయన పనిచేశారు. మెక్‌గిల్ యూనివర్సిటీలో అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా కూడా సేవలందించారు. అతని గిట్‌హబ్ (GitHub) ప్రొఫైల్ ప్రకారం.. రిషభ్ ప్రధానంగా రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)పై పరిశోధనలు చేస్తారు. గూగుల్ ప్రతిష్టాత్మక జెమ్మా (Gemma), జెమిని (Gemini) ఏఐ మోడల్స్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించడమే కాకుండా, ప్రతిష్టాత్మక NeurIPS ఔట్‌స్టాండింగ్ పేపర్ అవార్డును కూడా అందుకున్నారు.

అంత పెద్ద ఆఫర్‌ను ఎందుకు వదులుకున్నారు?

రిషభ్ అగర్వాల్ ఏప్రిల్ 2025లో మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌లో రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్, రీజనింగ్ విభాగంలో చేరారు. అయితే, అక్కడ చేరిన కేవలం ఐదు నెలలకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని అప్పట్లో ఎక్స్‌లో ప్రకటిస్తూ.. “మెటా ఏఐలో ఇది నా చివరి వారం. ఇంతటి అద్భుతమైన ప్రతిభ, కంప్యూటింగ్ సదుపాయాలు ఉన్న సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్‌ను వదిలి వెళ్లడం కష్టమైన నిర్ణయమే. కానీ గూగుల్ బ్రెయిన్, డీప్‌మైండ్, మెటా సంస్థలలో దాదాపు 7.5 ఏళ్ల ప్రయాణం తర్వాత.. నా జీవితంలో ఒక భిన్నమైన రిస్క్ తీసుకోవాలనే బలమైన కోరిక కలిగింది” అని రాసుకొచ్చారు. తన రాజీనామా సమయంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చెప్పిన ఒక ప్రసిద్ధ సూక్తిని ఆయన ఉటంకించారు. “చాలా వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో, మీరు తీసుకోగల అతిపెద్ద రిస్క్ ఏంటంటే.. అసలు ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే.” అని పేర్కొన్నారు.

ఏఐ స్టార్టప్ వైపు అడుగులు..
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలో లగ్జరీ లైఫ్‌ను వదిలేసిన రిషభ్ అగర్వాల్, ప్రస్తుతం ‘పీరియాడిక్ ల్యాబ్స్’ (Periodic Labs) అనే సరికొత్త ఏఐ స్టార్టప్‌లో వ్యవస్థాపక సభ్యుడిగా (Founding Member) చేరారు. ఈ స్టార్టప్ ప్రస్తుతం ఒక ‘ఏఐ సైంటిస్ట్’ (AI Scientist)ను రూపొందించే పనిలో ఉంది. ఈ ఏఐ సైంటిస్ట్ నిజ జీవితంలో జరిగే శాస్త్రీయ ప్రయోగాలకు సంబంధించి ఊహలను, సిద్ధాంతాలను (Hypotheses) స్వయంగా సిద్ధం చేయగలదు. దీనివల్ల సరికొత్త రసాయన పదార్థాలు, ఔషధాల ఆవిష్కరణలు, భౌతిక శాస్త్ర రంగాలలో పరిశోధనలు మరింత వేగవంతం అవుతాయి. శాస్త్రీయ పరిశోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న ఈ స్టార్టప్‌కు ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఎన్విడియా (Nvidia), జెఫ్ బెజోస్ (Jeff Bezos)ల నుంచి భారీ పెట్టుబడులు, మద్దతు లభించడం విశేషం.