సాంకేతిక ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) హవానే నడుస్తోంది. అయితే, ఈ AI విప్లవం ఇప్పుడు సామాన్య వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టబోతోంది. AI డేటా సెంటర్ల నుండి వస్తున్న విపరీతమైన డిమాండ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో RAM (ర్యామ్) , SSD (మెమరీ స్టోరేజ్) చిప్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఫలితంగా, 2026లో స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్ల ధరలు 5 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామ్సంగ్, SK హైనిక్స్ వంటి దిగ్గజ సంస్థలు తమ మెమరీ చిప్ ఉత్పత్తిని సాధారణ స్మార్ట్ఫోన్లు, పీసీల నుండి మళ్లించి, లాభదాయకమైన AI డేటా సెంటర్ల వైపు మళ్లిస్తున్నాయి. AI సర్వర్లకు అవసరమైన హై-బ్యాండ్విడ్త్ మెమరీ (HBM) , DDR5 ర్యామ్ తయారీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో, సాధారణ ఎలక్ట్రానిక్ వస్తువులకు వాడే చిప్ల సరఫరా తగ్గిపోయింది. దీనివల్ల ర్యామ్ , ఎస్ఎస్డీల ధరలు గత కొన్ని నెలల్లోనే రెండు మూడు రెట్లు పెరిగాయి. ఉదాహరణకు, గతంలో రూ. 3,000 కు లభించిన 16GB ర్యామ్ స్టిక్ ధర ఇప్పుడు రూ. 5,000 మార్కును దాటిపోయింది.
Telangana Assembly : తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పెను మార్పు.. ఇద్దరు పిల్లల నిబంధనకు చెక్..
ఈ మెమరీ సంక్షోభం కారణంగా డెల్ (Dell), లెనోవా (Lenovo), షియోమి (Xiaomi) వంటి కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మిడ్-రేంజ్ , బడ్జెట్ ఫోన్ల తయారీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరలను పెంచడం ఇష్టం లేని కంపెనీలు, అదే ధర వద్ద తక్కువ ర్యామ్ లేదా తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు, యాపిల్ , సామ్సంగ్ వంటి పెద్ద కంపెనీలకు ముందే కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు ఉండటం వల్ల, వాటిపై ఈ ప్రభావం కొంత తక్కువగా ఉండవచ్చు.
ఐడీసీ (IDC) , సిటీ గ్రూప్ వంటి పరిశోధనా సంస్థల అంచనా ప్రకారం, ఈ మెమరీ చిప్ల కొరత 2027 వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో “చౌకైన మెమరీ , స్టోరేజ్ యుగం” ముగిసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 2025 నుండే అనేక కంపెనీలు తమ ధరలను సవరించడం ప్రారంభించాయి. మీరు కొత్తగా లాప్టాప్ లేదా స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగకముందే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.