భూమిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ నష్టం రాదు. కాస్త డబ్బు ఉంటే ఒక సెంటు భూమి అయినా కొనిపెట్టుకో.. అవసరానికి అక్కరకు వస్తుందని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్ నడుస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టినా గిరాకీ మాత్రం పుంజుకోలేదు. ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. అవసరానికి మించి కట్టిన ఇళ్లు మార్కెట్ లో నెగటివ్ సెంటిమెంట్ కు కారణమయ్యాయి. 111 జీవో ఎత్తివేతపై కూడా మరింత స్పష్టత అవసరమనే భావన ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో క్యాష్ ఫ్లో మందగించడం రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపుతోంది.
దేశంలో కోట్లాదిమందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధినిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉంది. మధ్యతరగతి జీవుల సొంతింటి కలలు కల్లలవుతున్నాయి. కరోనా అనంతర పరిస్థితి తరువాత కాస్తోకూస్తో ఈ రంగం నిలదొక్కుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఐటీ రంగం తిరిగి పుంజుకోవడంతో కొన్నాళ్లుగా మంచి ఊపుమీదున్న నిర్మాణ రంగం మళ్ళీ చతికిలబడింది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి. జనం అవసరాలను దాటి కన్స్ట్రక్షన్ పెరిగింది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ చేయలేరు. నగరానికి ఇబ్బడి ముబ్బడిగా కొత్త ఉద్యోగాలు రాలేదు. కొత్త కంపెనీలు కూడా రాలేదు. కమర్షియల్ స్పేస్ మిలియన్ల SFT ఖాళీగా పడివుంది. సాఫ్ట్వేర్ నిపుణుల ఖర్చు తగ్గింది. వర్క్ఫ్రమ్ హోమ్ వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయింది. రెంట్స్ రావడం లేదు. SFT 50రూపాయలకు కూడా వెళ్లడం లేదు. అపార్ట్మెంట్స్ సేల్స్ బాగా పడిపోయాయి. కొత్త కన్స్ట్రక్షన్కి సమాచారం కోసం వచ్చేవాళ్లే లేరు. అలాగని ల్యాండ్ సేల్స్ కూడా స్పీడ్గా ఏమీ లేవు. జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది. ఆసక్తి తగ్గింది. సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి.
ముడి సరుకు. సిమెంట్, స్టీలు వంటివాటి ధరలు, లేబర్ చార్జీలు పెరిగిపోవడంతో బిల్డర్లు అపార్టుమెంట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఆకాశాన్ని అంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. బిల్డర్లు, ప్రైవేటు పెట్టుబడిదారులకు కూడా సమయానికి సొమ్ము రాక నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారు. రియల్ ఎస్టేట్ రంగం తిరిగి నిస్తేజంగా మారింది. నిధులు సమకూర్చుకోలేకపోవడంతో దాదాపు 5 లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయినట్టు రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తన సర్వేలో తెలిపింది. ఇలా మధ్యలోనే నిలిచిపోయిన ప్రాజెక్టుల విలువ సుమారు నాలుగున్నర లక్షల కోట్లని అంచనా.. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ రుణాలను నిరర్థక ఆస్తులుగా ఎక్కడ ప్రకటిస్తారేమోనని భయపడుతున్నాయి. కొత్త ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి.
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది.
ఈ ఏడాది మే, జూన్లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే క్యూ2లో సెంటిమెంట్ సూచీ స్కోరు తగ్గింది. వచ్చే ఆరు నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్ ధోరణి సెంటిమెంట్ సూచీ కూడా క్యూ1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి క్యూ2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం.
రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు .. అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యాఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్లు గత 8, 10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విభాగం వృద్ధి బాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటం తదితర అంశాలతో గత 3, 4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది.
ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరు కు గట్టి పోటీ ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అమ్మకాల వృద్ధి కంటే చాలా మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. కానీ… కరోనా కాటుతో హైదరాబాద్లోనూ రియల్ ఎస్టేట్ అధికంగా ప్రభావితం అవుతోంది. 2020 జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ కేవలం 2 వేల 680 యూనిట్ల గృహాలు అమ్ముడుపోయాయి. 2019 లో 5 వేల 400 అమ్ముడయ్యాయి.
మొత్తం ఏడు నగరాల్లో సర్వే చేసిన అనరాక్ సంస్థ.. ముంబై, ఢిల్లీ నగరాల్లో 75 శాతం, పూణేలో 10 శాతం, కోల్ కతాలో 5 శాతం పనులు ఆగిపోయినట్టు తెలిపింది. అలాగే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలో కలిపి 5 శాతం నిర్మాణాలు నిలిచిపోయాయి. కానీ ఇది ఇంతటితో ఆగుతుందా ? అంటే చెప్పే పరిస్థితి లేదు. నవంబరు, డిసెంబరు వరకు కూడా ఈ మాంద్యం దక్షిణాదిన కొనసాగవచ్చునని భయపడుతున్నారు. ఒక్కో చదరపు అడుగు ధర రూ. 4500 నుంచి రూ.20 వేల వరకుపలుకుతుండడంతో కొనుగోలుదారులు బేర్ మంటున్నారు.
కరోనాకి ముందు.. కరోనా తరువాత అన్నట్టు పరిస్థితి ఏర్పడింది. పేదలు, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది.. అయితే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఎప్పటికప్పుడు తన మానిటర్ పాలసీలో మార్పులు చేస్తూ వచ్చింది. బిల్డర్లు ఓ వైపు కొత్త ప్రాజెక్టులు చేబడుతూ ఎడాపెడా వాటికి అనుకూలంగా రేట్లు కూడా పెంచారు. కానీ అసలు సమస్య వచ్చిపడింది. అపార్టుమెంట్లలో సౌకర్యాలకన్నా విల్లాలే బెటర్ అన్న అభిప్రాయానికి వచ్చారు కొనుగోలుదారులు.. మరో వెయ్యి నుంచి 2 వేలు అదనంగా ఖర్చు చేస్తే విల్లా వస్తుందని ఆశించారు. కానీ రానురాను తమకు అడ్వాన్సులు రాకపోవడంతో బిల్డర్లు పనులు నిలిపివేశారు. ఎన్నో భవనాలు ఖాళీగా పడివున్నాయి. కొన్ని సగంలోనే ఆగిపోయాయి. వడ్డీలు పెను భారం కానుండగా బిల్డర్లకు కష్టకాలం వచ్చిపడింది. మరో రెండు నెలల వరకు మాత్రమే వారు తట్టుకోవచ్చు.. ఇప్పటికే నగరంలో 90 వేల ఇళ్ల నిర్మాణం జరగ్గా.. సగటున ఏటా 50 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. అంటే మరో రెండేళ్లకు సరిపోయే ఇళ్ళు రెడీగా ఉన్నాయి. 2026 వరకు పొజిషన్ ఇస్తామని, ప్రీ లాంచ్ పేరుతో మరో 50 వేల ఇళ్ళు రెడీ కానున్నాయని తెలుస్తోంది. మొత్తానికి మరో మూడేళ్లు ధరలు స్థిరంగా ఉండవచ్చని మధ్యతరగతి వర్గాల ఆశపడుతున్నాయి.ఈ ఆశల కారణంగా కూడా ఇళ్ల కొనుగోళ్ల విషయంలో వేచి చూసే ధోరణి పెరిగింది. దీంతో రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఏటా అన్ సీజన్లో ఇలాంటి ట్రెండ్ మామూలే అయినా.. ఈసారి మాత్రం గడ్డు పరిస్థితులు ఉన్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
అసలు రియల్ ఎస్టేట్ లో సంక్షోభం ఎందుకొచ్చింది..? ఎన్నికలకూ, దీనికీ లింకుందా..? ఎన్నికలయ్యే దాకా పరిస్థితి ఇంతేనా.?
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది. మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది. ఇక్కడ చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు. అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజు వేసుకుని.. ప్లాన్ చేస్తే కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్పులిచ్చాయి. దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు.
హైదరాబాద్ లో మునుపెన్నడూ లేని విధంగా.. భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా.. కనీసం 42 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదనే విషయం వాస్తవం. ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణల్లో అంగీకరిస్తున్నా.. పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు. ప్రజల జీవనప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను.. ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా.. మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది. సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్ మెంట్ కు ముందుకు రావడం లేదు. కరోనా తర్వాత అందరిలోనూ జాగ్రత్త పెరిగింది. నాలుగు డబ్బులు చేతిలో ఉంటే నయం కదా.. ఎన్ని ఆస్తులున్నా.. అవసరానికి అమ్ముడుపోతాయా అనే ఆలోచనా ధోరణి మొదలైంది. దీంతో రియల్ మార్కెట్లోకి గతంలో మాదిరిగా డబ్బులు డంప్ చేసే పరిస్థితి లేదు.
హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు. హైదరాబాద్ లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు, ఉద్యోగాలు రాని మాట వాస్తవం. అలాంటప్పుడు కొత్త ఇళ్లు ఎవరు కొంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉద్యోగాలు పెరగకుండా.. వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు. పైగా కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికిప్పుడు హడావుడిగా ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలిచే ఉద్దేశం ఐటీ కంపెనీలకు అసలే లేదు. ఈలోగానే జులైలో ఫోర్త్ వేవ్ అనే హెచ్చరికలు కూడా వచ్చేశాయి. ఎలాగో ఇన్నాళ్లు నెట్టుకొచ్చాం.. మరికొన్నాళ్లు వేచిచూస్తే పోయేదేముందని కంపెనీలు అనుకుంటే.. అది రియల్ మార్కెట్ కు మరింతగా ప్రతికూలమయ్యే అవకాశాలున్నాయి. అన్నిరకాలుగా డిమాండ్ తగ్గుతుంటే.. మార్కెట్ ఎలా పుంజుకుంటుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్దినెలలుగా నెమ్మదించింది. కోవిడ్ అనంతరం ప్రదర్శించిన దూకుడు ప్రస్తుతం కనిపించడం లేదు. మార్కెట్ కొంత స్తబ్ధుగా ఉంది. తెలుగు రాష్ట్రాల ఎన్నికలయ్యేదాకా ఇదే పరిస్థితి ఉంటుందనే చర్చ నడుస్తోంది.
రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది తొలి ఆరునెలల్లో గత ఏడాది కంటే ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. ఇళ్ల లావాదేవీలు నెలనెలా తగ్గుతూ వస్తున్నాయి. మార్కెట్లోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కొన్ని పేరున్న సంస్థలు మినహాయిస్తే ఇతర సంస్థలు, చిన్న బిల్డర్లు నిర్మించిన అపార్ట్మెంట్లలో విక్రయాలు అంత ఆశాజనకంగా లేవు. ఏటా హైదరాబాద్ మార్కెట్లో కొన్నినెలల పాటు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. వర్షాకాలంలో, పిల్లలు పాఠశాలలు తెరిచిన సమయంలో, మంచి రోజులు లేని మాసాల్లో , సంవత్సరం ఆఖర్లో ఇళ్ల విక్రయాలు తగ్గుతుంటాయి. కానీ మొత్తంగా చూస్తే మార్కెట్ సానుకూలంగా కనిపిస్తుంటుంది. ఈసారి కూడా అంతేనని కొందరు బిల్డర్లు అంటే.. మరికొందరు మాత్రం ఇప్పుడప్పుడే పుంజుకునేలా లేదని అంటున్నారు. అందుకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అపార్ట్ మెంట్లు అమ్ముడుపోవడం కష్టంగా ఉంది. ఖాళీ స్థలాల అమ్మకాల్లోనూ స్తబ్ధత నెలకొంది. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడం, బయట క్యాష్ ఫ్లో లేకపోవడం దీనికి కారణంగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికలయ్యేదాక ఇదే పరిస్థితి కొనసాగుతుందనే అంచనాలున్నాయి.
భూముల ధరలు పెరిగి, నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల ధరలు సైతం కొవిడ్ అనంతరం భారీగా పెరిగాయి. అయినా వడ్డీరేట్లు తక్కువ ఉండటంతో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. అయితే ఇటీవల ఆర్బీఐ రెపో రేటు పెంచింది. దీంతో వడ్డీరేట్లు పెరిగాయి. ఫలితంగా ఇల్లు కొనే స్థోమత కొంత తగ్గింది. మున్ముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతోనూ కొంతమంది వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ప్రత్యేకించి రూ.50-80 లక్షల లోపు నివాసాల కొనుగోలుపై ప్రభావం పడింది. నగరంలో మొత్తం విక్రయాల్లో వీటి వాటానే అధికంగా ఉంటుంది. దీనికి తోడు మార్కెట్ ను అంచనా వేయకుండా.. అవసరానికి మించి అతిగా చేసిన నిర్మాణాలు కూడా కొంప ముంచుతున్నాయి. కొందరు రియల్టర్ల అత్యాశ.. మొత్తం రియల్ ఎస్టేట్ ను మందగమనంలోకి నెట్టేసింది.
ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుంది? అంటే ఎన్నికలయ్యేదాకా అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల చర్చకు తెరలేచింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఏ రకంగా చూసినా ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉంది. గత చరిత్ర చూస్తే ఎన్నికల సంవత్సరంలో స్థిరాస్తి రంగం కొంత నెమ్మదిస్తుంది. ఎంతోకాలంగా ఇదే సెంటిమెంట్ నడుస్తోంది. దీనికి భిన్నంగా గతసారి ఎన్నికల సమయంలో మార్కెట్ పోకడ కనిపించింది. హఠాత్తుగా ముందస్తు ఎన్నికలు రావడం.. అప్పుడే వేర్వేరు సమస్యల నుంచి రియల్ ఎస్టేట్ కోలుకుని పరుగులు పెరుగుతుండటంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. రెండోసారి అంతక్రితం ఉన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే విశ్వాసం కారణంగా మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడలేదు. ఈసారి హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదనే అంచనాలతో.. అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఈ ప్రభావం కూడా అప్పుడే మార్కెట్పై కనిపిస్తోందని అంచనా. 2023వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కొందరు భావిస్తుంటే.. 2024లో జరిగే ఏపీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా అయితే కానీ.. రియల్ గమనంపై ఓ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదనే అభిప్రపాయం కూడా వినిపిస్తోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీలాంచ్లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా రెండు లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
కొత్త ఇళ్ల ధరలు అందుకోలేనంతగా పెరగడంతో కొన్ని వర్గాలవారు పాత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ బడ్జెట్లో దొరికే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ తరహా లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ కొత్త ఇళ్ల లభ్యత సైతం తక్కువే. అయితే ఈ లావాదేవీల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. మార్కెట్ స్తబ్ధుగా ఉన్న తరుణంలో ప్రవాస భారతీయుల పెట్టుబడులు కొంత ఊరట అనే చెప్పాలి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటంతో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్ఆర్ఐలు ఆసక్తి చూపిస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. వీరు ఎక్కువగా ప్రీమియం ఇళ్ల ప్రాజెక్టులు, తెలుగు రాష్ట్రాల్లో అయితే భూములపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే నిజంగా ఎన్నారై పెట్టుబడులు ఆ స్థాయిలో వస్తున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. కొంతమంది బిల్డర్లు అసలు విషయం దాచిపెట్టడానికి.. ఇలాంటి లీకులిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్ లో టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది. కానీ చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ సంక్షోభంలో పడ్డాయి. అయితే కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతూనే ఉందనే మాట నిజం. ఇవన్నీ గతంలో జరిగిన ఒప్పందాల మేరకు కడుతున్న నిర్మాణాలు. కానీ కొందరు బిల్డర్లు మాత్రం అసలు విషయం చెప్పకుండా.. డిమాండ్ లేకపోతే ఈ స్థాయిలో నిర్మాణాలు ఎందుక చేపడతాం అని ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో.. బయట క్యాష్ ఫ్లో కూడా తగ్గిపోయిందనే వాదన వినిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం ఆర్థిక వనరుల సమకూర్చుకునే పనిలో పడటంతో.. క్యాష్ రొటేషన్ కావడం లేదు. ఈ కారణాలన్నీ రియల్ ఎస్టేట్ పై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి. జనం కూడా ఎన్నికల ఫలితాలను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చనే ఆలోచనతో ఉన్నారు.. ఇప్పుడు హడావుడి ఎందుకు.. రెండేళ్లు ఆగితో పోయేదేముందనే ధోరణి పెరుగుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ల అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి.డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని మరచిన బిల్డర్స్ ,డెవలపర్స్ వెంచర్ల ఓనర్లు అత్యాశ దెబ్బకు హైదరాబాదు చుట్టూ అక్షరాల రెండు లక్షలకు పైగా అపార్ట్మెంట్ లు ఇప్పుడు అమ్ముడు పోక ఖాళీగా పడున్నాయి. కొనుగోలు దారుల ప్రియార్టీలను పట్టీంచుకోండా తాము కట్టిందే స్వర్గమన్న ఆలోచనలతో నిర్మించిన అపార్ట్మెంట్ లు ఇప్పుడు అమ్ముడు పోకపోవడంతో హైదరాబాద్ లో రియల్టర్లు ఇప్పుడు దిక్కు తోచని స్థితి లో పడ్దారు.
దశాబ్దకాలంగా ఎన్నడు లేని విధంగా IT బూమ్ వల్లనో, పరిశ్రమల ఏర్పాటు..తో పాటు అనే క కారణాల వల్ల.అంతర్జాతీయ స్థాయి కంపెనీల పెట్టుబడులకు హైదరాబాదు కేంద్రంగా మారింది.ఈ పాజిటివ్ అంశాలను రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపరులు తమ రియాల్టీకు అనుకూలంగ్ అమలుచుకుని.. ఎన్నడు లేనంతగా అపార్ట్మెంట్ లు..ఇండివిడ్యువల్ హౌస్ లనిర్మాణాలను పెంచేసారు. అయితే మార్కెట్ ఎప్పుడూ ఒకేలా వుండదన్న వ్యాపార సూత్రాన్ని పాటించడంలో మాత్రమ్ గ్రేటర్ రియల్టర్ లు విఫలమయ్యారు..
దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు అనేక రంగాల పరిస్థితి తారుమారు అయ్యిందన్నది ఓపెన్ సీక్రెట్..అయితే హైదరాబాదు లోని రియల్టర్లంతా కరోనా సమయంలో కూడా అపార్ట్మెంట్ ల అమ్మకాలు దుమ్ము దులిపాయన్న ఓవర్ పబ్లిసిటీ తో గ్రేటర్ లో కృత్రిమ వ్యాపారాన్ని సృష్టించారు..ఇప్పుడు అదే రియల్టర్ల పాలిట శాపంగా మారిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో మిడిల్ క్లాస్..ఎబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సొంతి ఇంటికలను నెరవేర్చుకోవడానికి బిల్డర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వెస్ట్ ప్రాంతాలైన గచ్చిబౌలి..నార్శిగ్..కోకాపేట..ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. కొండాపూర్ మాదాపూర్..తెల్లాపూర్..గోపన పల్లి, హైటెక్ సిటీ..కూకట్పల్లి.. మియాపూర్, లలో ఇప్పుడు ఫ్లాట్స్ అమ్మకాలు జరుగక అనేక చోట్ల ఖాళీ గా దర్శమిస్తున్నాయి..కరోనా వున్న రెండేళ్ల కాలం లో సైలెంట్ మార్కెట్ ను క్యాస్ చేసుకుందామని ప్రీలాంచ్ ఆఫర్లు ప్రకటించి.. బయ్యర్ల నుండి అడ్వాన్స్ లు తీసుకుని.. ఇంకా ఇప్పటి కీ నిర్మాణం ప్రారంభించని అపార్ట్ మెంట్ల ప్రాజెక్టు లు హైదరాబాదు లో వేలల్లో వున్నాయి.
ఓన్లీ బిజినెస్..నో ప్లానింగ్..ఎక్కడైనా .ఓప్రాజెక్ట్ ప్రారంభించాలి అంటే దాని లాభారిష్టాలు ఏంటన్న లెక్కలు వేయడమ్ కామన్..కానీ హైదరాబాదు రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారులు మాత్రం ఈ అంచనాలు వేసి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పొచ్చు. కేవలం స్థలం దొరికితే చాలు అన్నట్లుగా కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించి.. భూమి పూజలు చేసి..పిల్లర్లు..లేపి అడ్వాన్స్ లు తీసుకోవడం తో సరిపెట్టారు కొంతమంది. మరి కొంతమంది మాత్రం ప్రీ లాంచ్ ఆఫర్లతో బయ్యర్లను ఆకర్షించి సగానికి పైగా నిర్మాణాలు జరిపారు.. ఇక బడా రియాల్టీ బాసులైతే చెప్పినవన్ని పూర్తి చేసినా కానీ మార్కెటింగ్ చేసుకోవడం లో వెనుకబడ్డారు..దీనితో హైదరాబాద్ రియల్ రంగంలో అమ్ముడు కాని ఫ్లాట్ల సంఖ్య ఎంతలేదన్నా రెండు లక్షల దాకా ఉన్నాయి.
గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల కూడా రియల్ మార్కెట్ పడకేయడానికి ప్రధాన కారణం. సొంతిల్లు కోసం చూసేవారికంటే.. పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్ కు మహారాజపోషకులు. వడ్డీరేట్లు ఎప్పుడైతే పెరిగాయో.. సెకండ్ ఇన్వెస్ట్ మెంట్ పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా చైనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే.. మన దగ్గర కూడా రియల్ బుడగ పేలుతుంది. అప్పుడు లక్షల మంది జీవనోపాధిపైనా ప్రభావం తప్పదు.
ఇళ్లు కొనేవారు లేక, ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కిరాక.. రియల్ కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయి.
ప్రస్తుత విక్రయాల వేగం ప్రకారం, ఇన్వెంటరీ ఇప్పుడు మూడు నెలల సరఫరాలో ఉంది. ఇది ఇప్పటికీ తక్కువగా అంచనా అనే వాదన ఉంది, కానీ మెరుగుపడుతోంది. ఎక్కువ మంది రియల్టర్లు హౌసింగ్ బూమ్ చివరి దశను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున ఇప్పుడు మార్కెట్లో సరఫరా పెరుగుతోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత దాని ప్రభావానికి గురైనట్టే కనిపిస్తోంది. కొనుగోలుదారుల్లేక వేల సంఖ్యలో నివాసాలు ఖాళీగా ఉంటోన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈ సంవత్సరం ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రెట్టింపు అయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల వల్ల విధించిన లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల చాలామంది హైదరాబాద్ను ఖాళీ చేసి స్వస్థలాలకు తరలి వెళ్లడం.. వర్క్ ఫ్రమ్ హోమ్కు పరిమితం కావడం వంటి అంశాలు రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గడానికి కారణాలయ్యాయి. అదే సమయంలో ఇళ్ల ధరలు, భూముల రేట్లు భారీగా పెరగడం, ల్యాండ్ రేట్లను ప్రభుత్వం పెంచడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి దారి తీశాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.