Site icon NTV Telugu

కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ గుడ్ బై !

భారత టీ-20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ కథ ముగిసింది. ఎన్నో విజయాలు, మరెన్నో సిరీస్‌లు భారత్‌కు అందించి అత్యుత్తమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. తన చిరకాల కోరికైన టీ-20 వరల్డ్‌ కప్‌ సాధించకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. ఈ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు కోహ్లీ. ఏదో సాధించలేకపోయామన్న బాధ, నిర్వేదంలో విరాట్‌లో కనిపించింది.

బ్యాట్స్‌మన్‌గా సూపర్‌ సక్సెస్‌ అందుకున్న కోహ్లి కెప్టెన్‌గా మాత్రం విఫలమయ్యాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ నుంచి మొదలుకొని.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌.. తాజాగా టీ-20 ప్రపంచకప్‌ వరకు కోహ్లికి కెప్టెన్‌గా కలిసిరాలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా కోహ్లి టీ-20ల్లో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమిండియా 31 మ్యాచ్‌లు గెలిచి 16 ఓడిపోయింది.

63.27 శాతంతో సారథిగా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లికి.. ఎందుకో ఐసీసీ ఫార్మాట్‌లో మాత్రం దురదృష్టమే ఎదురవుతూ వస్తోంది. ఇక వన్డే, టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న కోహ్లి 2023 వన్డే వరల్డ్‌కప్‌ అయినా సాధిస్తాడా అనేది ప్రశార్నర్థకమే. ఎందుకంటే వన్డే కెప్టెన్సీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని.. రోహిత్‌కు వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి.. కోహ్లిని కేవలం టెస్టు కెప్టెన్‌గా పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం.

Exit mobile version