Vaibhav Sooryavanshi Set for India Debut in 2nd T20 vs England: చెస్టర్-లీ-స్ట్రీట్ స్టేడియంలో బుధవారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని భారత తుది జట్టులోకి చోటు దక్కలేదు. బుడ్డోడిని ప్లేయింగ్ 11లో ఎంపిక చేయకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ అతడికి అవకాశం దక్కలేదు. ఆ సిరీస్ను భారత్ 0-2తో కోల్పోవడంతో.. తొలి టీ20లో అయినా సూర్యవంశీకి అవకాశం ఇస్తారని అభిమానులు భావించారు. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం మరోసారి బుడ్డోడికి హ్యాండ్ ఇచ్చి.. సేనియర్లపైనే నమ్మకం ఉంచింది.
రెండు మ్యాచ్ల్లో 5, 0 రన్స్:
ఐర్లాండ్ సిరీస్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. సంజు రెండు మ్యాచ్ల్లో 5, 0 పరుగులకే పరిమితం కాగా.. అభిషేక్ శర్మ 49, 0 పరుగులు చేశాడు. అయినప్పటికీ వారిద్దరినీ ఇంగ్లండ్తో తొలి టీ20లో టీమ్ మేనేజ్మెంట్ కొనసాగించింది. దాంతో టీ20 ప్రపంచకప్ 2026ను గెలిపించిన ఆటగాళ్లపైనే జట్టు యాజమాన్యం పూర్తి నమ్మకం ఉంచిందని స్పష్టమైంది. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్లో మంచి ఆరంభం చేయాలని భావిస్తున్నాం. ఐర్లాండ్ సిరీస్ ఇప్పుడు గతం. వికెట్పై గడ్డి ఉన్నా ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడం కష్టం. అయితే మా ఆటతీరు మాత్రం దూకుడుగానే ఉంటుంది. ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం’ అని వెల్లడించాడు.
7 బంతుల్లో ఒక రన్:
మ్యాచ్కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో కూడా శ్రేయస్ అయ్యర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. గత టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు భద్రత, విశ్వాసం కల్పించడం జట్టు లక్ష్యమని పేర్కొన్నాడు. ‘మా జట్టులో ప్రతి ఆటగాడూ తనదైన స్థాయిలో రాణించాడు. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని వారికి నిరంతర అవకాశాలు ఇవ్వడం అవసరం. ప్రపంచకప్ గెలిపించిన ఆటగాళ్లను మేము తప్పకుండా ప్రోత్సహిస్తాం’ అని అయ్యర్ చెప్పాడు. అయితే మొదటి టీ20లో అభిషేక్ శర్మ (59; 24 బంతుల్లో) రాణించినా.. సంజు శాంసన్ మరోసారి విఫలమయ్యాడు.7 బంతుల్లో ఓకే రన్ చేసి పెవిలియన్ చేరాడు.
దాదాపుగా డోర్స్ ఓపెన్ అయినట్లే:
సంజు శాంసన్ మరోసారి విఫలమవడంతో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంకు దాదాపుగా డోర్స్ ఓపెన్ అయినట్లే. వరుసగా మూడు మ్యాచ్లలో నిరాశపర్చిన సంజు.. రెండో టీ20లో ఆడడం కష్టమే. ఇప్పటికే బుడ్డోడిని ఆడించాలని డిమాండ్స్ వస్తుండడం, వరుసగా సంజు విఫలమడంతో వైభవ్ అరంగేట్రంకు సమయం వచ్చిందని అందరూ అంటున్నారు. వరుస వైఫల్యాలతో సంజునే స్వయంగా బుడ్డోడికి ఛాన్స్ ఇస్తున్నాడు అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సంజు రాణించి ఉంటే.. వైభవ్ మరికొన్ని రోజులు ఆగాల్సి ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.
అద్భుత ఫామ్లో బుడ్డోడు:
ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ ఇటీవల అద్భుత ఫామ్లో ఉన్నాడు. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో 16 ఇన్నింగ్స్లలో 776 పరుగులు చేసి టోర్నమెంట్ అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. అనంతరం శ్రీలంకలో జరిగిన మ్యాచ్లో ఇండియా-ఏ తరఫున కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి తన సత్తా మరోసారి చాటుకున్నాడు. ఇలాంటి ప్రదర్శనలతో జాతీయ జట్టులో స్థానం సంపాదించినప్పటికీ.. తొలి టీ20లో అతడికి అవకాశం రాలేదు. సూర్యవంశీ ఈ సిరీస్లోని రెండో మ్యాచ్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అలా జరిగితే 15 సంవత్సరాల 96 రోజుల వయసులో అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఐర్లాండ్కు చెందిన జోషువా లిటిల్ పేరిట ఉంది.

