Vaibhav Sooryavanshi India U19 Snub: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న అండర్-19 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, మాజీ టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తన సత్తా చాటిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మాత్రం నిరాశే ఎదురైంది. బుడ్డోడిని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
బీసీసీఐ ప్రత్యేక నిబంధనే:
15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా తరఫున టీ20 క్రికెట్లో కూడా అరంగేట్రం చేశాడు. ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడు అండర్-19 జట్టులో లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అతడిని తప్పించడానికి కారణం ఫామ్ లేదా ఫిట్నెస్ కాదని తెలుస్తోంది. బీసీసీఐ ప్రత్యేక నిబంధనే బుడ్డోడిని అండర్-19 జట్టుకు దూరం చేసింది. 2016లో అండర్-19 ప్రపంచ కప్కు సంబంధించిన కీలక నిబంధనను బీసీసీఐ అమల్లోకి తీసుకొచ్చింది. అర్హత ఉన్నప్పటికీ.. ఒక ఆటగాడు ఒకటి కంటే ఎక్కువ అండర్-19 ప్రపంచ కప్లలో పాల్గొనకుండా ఈ నిబంధనను తీసుకొచ్చారు. అంతకుముందు పలువురు ఆటగాళ్లు ఒకటి కంటే ఎక్కువ ఎడిషన్లలో ఆడినప్పటికీ.. ఆ తర్వాత ఈ విషయంలో బీసీసీఐ పరిమితులు విధించింది.
ప్రపంచ కప్లో ఆడేందుకు వీల్లేదు:
ఈ నిబంధన కారణంగా వాషింగ్టన్ సుందర్ 2018 అండర్-19 ప్రపంచ కప్లో ఆడలేకపోయాడు. అంతకుముందు సర్ఫరాజ్ ఖాన్, సందీప్ శర్మ, విజయ్ జోల్ వంటి ఆటగాళ్లు మాత్రం అండర్-19 ప్రపంచ కప్లో ఒకటి కంటే ఎక్కువ ఎడిషన్లలో పాల్గొన్నారు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే 2026 అండర్-19 ప్రపంచ కప్లో పాల్గొన్నాడు. దీంతో భవిష్యత్లో మరో అండర్-19 ప్రపంచ కప్లో ఆడేందుకు అతడికి అవకాశం ఉండదు. ఇదే కారణంగా ఆస్ట్రేలియాతో జరగనున్న అండర్-19 సిరీస్ కోసం అతడిని బీసీసీఐ జూనియర్ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
ప్రతిభ లేదా ఫామ్ కాదు:
వైభవ్ సూర్యవంశీకి ఆస్ట్రేలియాతో అండర్-19 సిరీస్లో చోటు దక్కకపోవదానికి కారణం అతడి ప్రతిభ లేదా ఫామ్ కాదు. ఇప్పటికే 2026 అండర్-19 ప్రపంచ కప్ ఆడిన కారణంగా.. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడిని మరో అండర్-19 ప్రపంచ కప్ ప్రణాళికల్లోకి తీసుకునే అవకాశం లేకపోవడమే అసలు కారణంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు 50 ఓవర్ల మ్యాచ్లు, రెండు మల్టీ-డే రెడ్బాల్ మ్యాచ్లు ఆడనుంది. 50 ఓవర్ల మ్యాచ్లు సెప్టెంబర్ 18, 21, 23 తేదీల్లో రాజ్కోట్లో జరుగుతాయి. అనంతరం సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు రాజ్కోట్లో తొలి మల్టీ-డే మ్యాచ్, అక్టోబర్ 5 నుంచి 8 వరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం ‘బి’ గ్రౌండ్లో రెండో మ్యాచ్ జరగనుంది.
కెప్టెన్గా లక్ష్య రైచందానీ:
వన్డే జట్టుకు ఉత్తరాఖండ్ బ్యాటర్ లక్ష్య రైచందానీ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మధ్యప్రదేశ్ బ్యాటర్ యశ్వర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. రెడ్బాల్ మ్యాచ్లకు మాత్రం యశ్వర్ధన్ చౌహాన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. లక్ష్య రైచందానీ వైస్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టులో చోటు సంపాదించారు. అయితే ఇద్దరికీ రెండు రెడ్బాల్ మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం లభించలేదు. ఆర్యవీర్ ప్రస్తుతం 2026 ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు అతడు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. మరోవైపు అన్వయ్ జూలైలో శ్రీలంక పర్యటనలో భారత్ అండర్-19 తరఫున రెండు వన్డే మ్యాచ్ల్లో 101 పరుగులు చేశాడు. ఆ పర్యటనలో భారత్ వన్డే సిరీస్ను 2-1తో కోల్పోయినా.. రెడ్బాల్ సిరీస్ను 1-0తో గెలుచుకుంది.

