Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?

  • తీవ్ర చర్చకు దారితీసిన వైరల్ వీడియో
  • సెల్ఫిష్ అంటూ కోహ్లీని అన్న వైభవ్
  • అసలు విషయం ఏంటంటే?
Vaibhav Sooryavanshi Kohli

Vaibhav Sooryavanshi Kohli

ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని స్లో, సెల్ఫిష్ అంటూ వ్యాఖ్యానించినట్లు ఉంది. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు వైభవ్ అలా సమాధానం ఇచ్చినట్లు వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో అని తేలింది. ఈ వైరల్ వీడియోపై హర్షా భోగ్లే స్పందిస్తూ.. అసలు విషయం ఏంటో చెప్పేశారు.

తాను అసలు అలాంటి ప్రశ్న అడగలేదని, వైభవ్ సూర్యవంశీ కూడా ఏ సమాధానం ఇవ్వలేదని హర్షా భోగ్లే స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన హర్షా భోగ్లే.. ‘నా, వైభవ్ సూర్యవంశీ పేర్లతో ఓ ఫేక్ డబ్బింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో వైభవ్‌ను అహంకారిగా, అసభ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇంతకీ నేను సూర్యవంశీని అలాంటి ప్రశ్న అడగలేదు. ఇది చాలా దురుద్దేశపూర్వకమైన చర్య. వినయంగా ప్రవర్తించే ఓ యువ ఆటగాడి ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నం. అది ఫేక్ వీడియో’ అని పేర్కొన్నారు.

×
×
Ad

వాస్తవానికి ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ మధ్య సంభాషణ జరిగింది. ఐపీఎల్ అధికారిక ఖాతా విడుదల చేసిన వీడియోలో ‘వెల్ ప్లేడ్ యంగ్ మ్యాన్’ అంటూ వైభవ్‌ను కోహ్లీ అభినందించాడు. మరోవైపు వైభవ్ చేతులు జోడించి కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు. ఈ దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఐపీఎల్ 2026లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న బుడ్డోడిపై కోహ్లీ ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. అవార్డు స్వీకరించేందుకు వైభవ్ స్టేజ్‌పైకి వెళ్లినప్పుడు కోహ్లీ తన మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడుతూ.. ‘ఈ కుర్రాడు చాలా స్పెషల్. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు’ అని అన్నాడు. ఈ మాటలు వైభవ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.

వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ మధ్య పరస్పర గౌరవం, అభిమాన భావాలు ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కొందరు ఫేక్ కథనాలు, డీప్‌ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. యువ ఆటగాళ్ల ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని, అధికారిక వర్గాల ద్వారా వచ్చిన సమాచారాన్నే విశ్వసించాలని క్రికెట్ అభిమానులకు మాజీలు సూచనలు చేస్తున్నారు.