Mohammad Shami: మహ్మద్ షమీపై నెటిజన్‌ల ట్రోలింగ్.. ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా శాఖ మంత్రి

Mohammad Shami

Mohammad Shami

Mohammad Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన ఓ పోస్టుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. దీంతో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా మహ్మద్ షమీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దసరా పర్వదినాన శ్రీ రాముడు మీ జీవితంలోని కోరికలను అన్నింటినీ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో సంతోషం, సంపద, విజయం అందించాలని నేను ప్రార్ధిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు’ అంటూ షమీ పోస్ట్ చేశాడు. ఈ మేరకు శ్రీరాముడి ఫోటోను షేర్ చేశాడు.

Read Also: Uber Cab: 6కి.మీ. ప్రయాణానికి రూ.32లక్షల బిల్లు.. షాక్‎లో ప్రయాణికుడు

అయితే కొందరు నెటిజన్‌లు మతం పేరుతో షమీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఓ ముస్లిం హిందూవుల పండగకు శుభాకాంక్షలు ఎలా చెప్తాడంటూ కొందరు నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ ట్రోల్స్‌ కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. దసరా పండుగ ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే వేడుక అని.. భారత క్రికెటర్లకు కూడా ఈ పర్వదినాన్ని జరుపుకోవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. మహ్మద్ షమీ ఈ పండుగను చేసుకుంటే వచ్చిన సమస్యేంటి అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వారు ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కానీ తాము అందరూ ఓ దేశం తరహాలో అన్నీ పండుగలను జరుపుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.