Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ!

Mumbai Indians Captain

Mumbai Indians Captain

Mumbai Indians Captain: ఐపీఎల్‌లో మరో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధమవుతోందా?.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరనున్నాడా?.. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ముంబై యాజమాన్యం ట్రేడ్ వార్తలను అధికారికంగా ఖండించినప్పటికీ.. ఈ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్, హార్దిక్ పాండ్య మధ్య జరిగిన సుదీర్ఘ చర్చే ఈ ప్రచారానికి కారణమైంది. అది సాధారణ సమావేశం కాదని, భవిష్యత్ ట్రేడ్‌కు తొలి అడుగు కావచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఎంఎస్ ధోనీపై గౌరవం:

హార్దిక్ పాండ్యకు చెన్నై సూపర్ కింగ్స్‌పై ప్రత్యేక అభిమానం ఉందనే విషయం గతంలోనే బయటపడింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ప్రశంసిస్తూ.. ప్రతి క్రికెటర్ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి అనువైన జట్టు చెన్నై అని వ్యాఖ్యానించాడు. అలాగే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై హార్దిక్‌కు ఉన్న గౌరవం, ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కూడా తెలిసిందే. దీంతో సీఎస్‌కేలో చేరే అవకాశం వస్తే.. హార్దిక్ ఆసక్తి చూపే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అయితే హార్దిక్‌ను వదులుకోవడానికి ముంబై పెద్ద మూల్యమే కోరుతున్నట్లు సమాచారం.

సీనియర్ ఆటగాళ్లతో విభేదాలు:

నివేదికల ప్రకారం.. హార్దిక్ పాండ్య కోసం శివమ్ దూబేతో పాటు ఆయుష్ మాత్రే లేదా ఖలీల్ అహ్మద్‌లలో ఒకరిని ట్రేడ్‌లో ఇవ్వాలని ముంబై యాజమాన్యం కోరుతోందని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా సీఎస్‌కే భవిష్యత్ ప్రణాళికల్లో కీలకంగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో హార్దిక్ కోసం చెన్నై వారిని వదులుకుంటుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2023 నవంబర్‌లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి పాండ్యకు ముంబై నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. గుజరాత్ నుంచి భారీ మొత్తానికి తిరిగి తీసుకొచ్చి జట్టు బాధ్యతలు అప్పగించినప్పటికీ.. ఆ నిర్ణయం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై రాణించలేకపోయింది. 2024 సీజన్‌లో చివరి స్థానంలో నిలిచిన ఎంఐ.. 2026లో కూడా ప్లేఆఫ్స్‌కు చేరకపోవడంతో యాజమాన్యం తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కొందరు సీనియర్ ఆటగాళ్లతో విభేదాలు, తరచూ గాయాల కారణంగా జట్టుకు దూరమవడం వంటి అంశాలు కూడా హార్దిక్‌పై విమర్శలకు దారితీశాయి.

తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు:

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శనపై సమీక్ష కొనసాగుతోందని, అది పూర్తయ్యాకే భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని ఫ్రాంచైజీ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు జట్టులో నాయకత్వ మార్పు జరిగితే తెలుగు స్టార్ తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మద్దతు తిలక్‌కు ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక సీఎస్‌కేలో ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్‌ను ధోనీ వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. సంజూ శాంసన్ పేరు కూడా భవిష్యత్ కెప్టెన్సీ రేసులో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో హార్దిక్ చెన్నైకి వెళ్లినా కెప్టెన్సీ దక్కడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు హార్దిక్ ట్రేడ్‌పై ముంబై లేదా చెన్నై నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.