నాల్గో టెస్టులో భారత బ్యాట్స్మెన్లు…అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్తోపాటు వన్డౌన్ బ్యాట్స్మెన్ పూజారా…రాణించారు. దీంతో భారత్ 3వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 171 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ జడేజా క్రీజులో ఉన్నారు. మరో 150 పరుగులు చేస్తే…భారత్ విజయం సాధించే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 171 పరుగుల ఆధిక్యం సాధించింది కోహ్లీ సేన. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్…తొలి వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద…కేఎల్ రాహుల్ ఔటయ్యాడు.
రాహుల్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన చతేశ్వర్ పూజారా….రోహిత్కు జత కలిశారు. వీరిద్దరు కలిసి…స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మరో వికెట్ పడకుండా…జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు 153 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మూడోరోజు భారత్ పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అద్భుతంగా ఆడుతున్న వీరిని రాబిన్సన్ ఒకే ఓవర్లో పెవిలియన్ పంపి భారత్కు గట్టి షాక్ ఇచ్చాడు. మొయిన్ అలీ వేసిన 63.5 ఓవర్కు రోహిత్ సిక్సర్ బాది టెస్టుల్లో ఎనిమిదో శతకం సాధించాడు.
81వ ఓవర్లో తొలుత పుల్షాట్ ఆడిన రోహిత్..127 పరుగుల వద్ద రాబిన్సన్ బౌలింగ్లో క్రిస్వోక్స్ చేతికి చిక్కాడు. 61 పరుగులు చేసిన పుజారా… అనూహ్య బంతికి మొయిన్ అలీకి దొరికిపోయాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 22 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అనంతరం కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు.
ఈ మ్యాచ్లో విజయావకాశాలు… భారత్కే ఎక్కువగా ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్ ఉన్నారని.. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న ఓవల్ మైదానంలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా ఆటగాళ్లంతా మ్యాచ్ గెలవాలనే కసితో ఉన్నారని అభిప్రాయపడ్డారు.