Sanju Samson: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయభేరి మోగించి.. కప్ను అందుకుంది టీమిండియా.. భారత్ సెమీస్ చేరాల్సిన మ్యాచ్.. ఆ తర్వాత సెమీస్.. ఫైనల్ మ్యాచ్లోనూ సంజు శాంసన్ ఇన్నింగ్స్ మరువలేనివి.. టీమ్ ఇండియాకు తాను ఎంత ముఖ్యమైన ఆటగాడో దీంతో మరోసారి నిరూపించాడు. ICC Men’s T20 World Cup సందర్భంగా అతను జట్టు కోసం చూపిన అంకితభావం గురించి టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
కెప్టెన్ ముందు సంజు ఒక్క మాట
టోర్నమెంట్ ప్రారంభంలో జట్టు కాంబినేషన్ల కారణంగా సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఆ సమయంలో అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కలిసి ఒకే ఒక మాట చెప్పాడట. “జట్టుకు నేను ఏమి చేయగలను చెప్పండి” అని సంజు అడిగాడని సూర్య వెల్లడించాడు. ఒక ఆటగాడి నుంచి ఇలాంటి జట్టు కోసం ఆలోచించే వైఖరి రావడం టీమ్కు పెద్ద బలం అని సూర్య తెలిపారు.
బెంచ్ ప్లేయర్లను మేనేజ్ చేయడం కష్టం
ప్రపంచ కప్ సమయంలో కెప్టెన్గా తనకు అత్యంత కష్టమైన పని ప్రతి మ్యాచ్లో ఆడే అవకాశం రాని ఆటగాళ్లను మానసికంగా సిద్ధంగా ఉంచడం అని సూర్య చెప్పారు. ఎప్పుడైనా అవకాశం వస్తే సిద్ధంగా ఉండటం వారికి సవాల్గా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే వారితో ఎక్కువ సమయం గడిపి మాట్లాడటం అవసరం అవుతుందని తెలిపారు. మరోవైపు.. టోర్నమెంట్ ప్రారంభంలో అవకాశాలు రాకపోయినా, నాకౌట్ దశలో సంజు శాంసన్కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ అవకాశాన్ని అతను అద్భుతంగా వినియోగించుకున్నాడు. వెస్టిండీస్పై సూపర్ 8 మ్యాచ్లో అజేయంగా 97 పరుగులు.. సెమీఫైనల్లో 89 పరుగులు.. ఫైనల్లో కూడా 89 పరుగులు.. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్లతో భారత జట్టు టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు సంజు శాంసన్..
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
కేవలం ఐదు ఇన్నింగ్స్లలోనే సంజు శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శనను గుర్తించి అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా లభించింది. అయితే, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని సంజు శాంసన్ చెప్పడం అతని టీమ్ స్పిరిట్ను మరోసారి చూపించింది.
