NTV Telugu Site icon

Rishabh Pant: జనం చూస్తే ఎలా అని భయపడ్డాను: పంత్‌

Rishabh Pant Dc

Rishabh Pant Dc

Rishabh Pant on Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ తెలిపాడు. తాను అస్సలు బతుకుతానని కూడా అనుకోలేదని, కానీ దేవుడు దయతలిచాడు అని పేర్కొన్నాడు. 2022 డిసెంబరు 30న పంత్‌ కారు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. కారులో మంటలు చెలరేగగా.. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి అతడిని బయటికి తీశాడు. దాంతో పంత్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

గాయాలు, సర్జరీలతో ఏడాదిన్నర పాటు రిషబ్ పంత్‌ ఆటకు దూరమయ్యాడు. రెండు నెలల కిందట ఐపీఎల్‌ 2024తో పునరాగమనం చేశాడు. పునరాగమనం చేయడమే కాదు.. అద్భుతంగా ఆడాడు కూడా. 11 ఇన్నింగ్స్‌లలో 398 రన్స్ చేశాడు. బ్యాటర్, కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. అద్భుత ప్రదర్శనతో అతడికి టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్‌లో మరోసారి భారత జెర్సీలో పంత్‌ కనిపించనున్నాడు. తుది జట్టులో చోటు కోసం అతడు సంజూ శాంసన్‌తో పోటీ పడాల్సి ఉంది. ఐపీఎల్ 2024లో సంజూ అదరగొట్టిన విషయం తెలిసిందే.

Also Read: Janhvi Kapoor Marriage: వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు: జాన్వీ

శిఖర్‌ ధావన్‌ టాక్‌ షోలో రిషబ్ పంత్‌ మాట్లాడుతూ… ‘రోడ్డు ప్రమాదం నా జీవితాన్నే మార్చేసింది. నేను బతుకుతానని కూడా అనుకోలేదు. కానీ ఆ దేవుడు నాపై దయతలిచాడు. చికిత్స చేసుకోవడానికి బయటికి వెళ్లాల్సి వచ్చేది. ఆరంభంలో నేను విమానాశ్రయానికి వెళ్లలేకపోయా. చక్రాల కుర్చీలో జనానికి కనపడడానికి చాలా భయపడ్డా. రెండు నెలల పాటు కనీసం పళ్లు తోముకోలేకపోయాను. ఏడు నెలల పాటు భరించలేని నొప్పితో బాధపడ్డా. అదంతా ఇప్పుడు తలుచుకుంటే.. భయమేస్తుంది’ అని చెప్పాడు.