Site icon NTV Telugu

Gautam Gambhir controversy: గంభీర్ రాజకీయాలతో టీమిండియాను నాశనం చేశాడు.. మాజీ క్రికెటర్‌ సంచలన ఆరోపణలు..

Gautam Gambhir Controversy

Gautam Gambhir Controversy

Gautam Gambhir controversy: టీమిండియా కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు గుప్పించాడు పాక్‌ మాజీ క్రికెటర్.. గంభీర్‌ రాజకీయాలను జట్టు వాతావరణంలోకి తీసుకొచ్చి టీమ్ ఇండియాను దెబ్బతీశాడు’ అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశాడు. భారత జట్టు కోచ్‌గా ఉన్న గంభీర్‌పై పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్ అహ్మద్ షెహజాద్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే, టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత గంభీర్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ మ్యాచ్‌లో తీసుకున్న జట్టు ఎంపిక నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే..

కీలక మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయాన్ని అశ్విన్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే కాగా.. 2019–2024 మధ్య తూర్పు ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన గంభీర్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ షెహజాద్ విమర్శలు గుప్పించారు. ఏ రంగంలోనైనా పూర్తి దృష్టి అవసరం. గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అతని ఆలోచనా విధానం మారిందని అనిపిస్తోంది. ఇప్పుడు అదే రాజకీయ ధోరణి జట్టు వాతావరణంలో కనిపిస్తోంది. ఇది భారత జట్టు ప్రతిష్టకు హానికరం అని షెహజాద్ వ్యాఖ్యానించాడు.

ఇక, జట్టు వద్ద ఉన్న ప్రతిభను సరైన విధంగా ఉపయోగించుకోవడంలో కోచ్ విఫలమయ్యాడని షెహజాద్ ఆరోపించాడు. ముఖ్యంగా కుల్‌దీప్‌ యాదవ్‌కు పరిమిత అవకాశాలు ఇవ్వడం పై ప్రశ్నలు లేవనెత్తాడు. “మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం ఉన్న కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోవడం లేదు. జట్టు వనరులను సమర్థంగా నిర్వహించడం జరగడం లేదు,” అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. కొంతకాలంగా జట్టులో అంతర్గత విభేదాలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక సందర్భంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే వారు ఆ వార్తలను ఖండిస్తూ వీడియో విడుదల చేసినప్పటికీ, ఆ అంశంపై ఇంకా చర్చ కొనసాగుతోంది. ఇక గంభీర్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు ఇప్పటివరకు ద్వైపాక్షిక సిరీస్‌లు కోల్పోలేదని చెప్పినా, వరుస కీలక మ్యాచ్‌ల నేపథ్యంలో ఒత్తిడి మాత్రం పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత జట్టు తన తదుపరి సూపర్ 8 మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫలితం జట్టు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Exit mobile version