IND vs WI: బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలపై గవాస్కర్ అసంతృప్తి

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియా చేసిన ప్రయోగాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌కు పంపించి… వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపడం సరికాదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు చాలా మంది ఓపెనర్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పంత్‌ను ఓపెనింగ్‌కు పంపించి ప్రయోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. రోహిత్‌తో పంత్‌ను ఓపెనింగ్ పంపడం చివరి ఆప్షన్‌గానే ఉండాలన్నాడు. ఒకవేళ ధాటిగా ఆడే ఎడమచేతి వాటం ఓపెనర్‌ కావాలనుకుంటే ఇషాన్ కిషన్‌ను తీసుకుంటే సరిపోయేదన్నాడు.

Read Also: IND vs WI 2nd ODI: మ్యాచ్‌ మనదే.. సిరీస్‌ కూడా మనకే

అటు కరోనాతో బాధపడుతున్న రుతురాజ్ గైక్వాడ్ కోలుకుంటే ఓపెనింగ్ స్థానంలో అతడు మంచి ఆప్షన్ అవుతాడని సన్నీ తెలిపాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫుడన ఆడిన అతడు… గత కొన్ని సీజన్‌లలో అద్భుతంగా ఆడాడని, దురదృష్టవశాత్తూ కరోనా వల్ల ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడని వివరించాడు. కాగా రెండో వన్డేలో రోహిత్, పంత్ ఓపెనింగ్‌కు దిగగా ఇద్దరూ విఫలమయ్యారు. కానీ మిడిలార్డర్‌లో దిగిన కేఎల్ రాహుల్ మాత్రం రాణించాడు. అదే అతడు ఓపెనర్‌గా ఆడుంటే టీమిండియా మరింత మెరుగైన స్కోరు చేసేదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.