NTV Telugu Site icon

IND Vs SL: టీ20 సిరీస్‌కు ప్రకటనలు కరువు.. స్టార్ నెట్‌వర్క్‌కు రూ.200 కోట్లు నష్టం

Star Network

Star Network

IND Vs SL: టీమిండియా, శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ను అభిమానులు లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అభిమానులు ఈ మ్యాచ్‌లను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో స్టార్ నెట్‌వర్క్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ శర్మ లేని సిరీస్‌ను ఎందుకు చూడాలని క్రికెట్ అభిమానులు భావిస్తుండటంతో ప్రకటన దారులు కూడా దూరమయ్యారు. ఈ సిరీస్‌తో స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ దాదాపు రూ.200 కోట్లకు పైగా నష్టపోయినట్లు బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు వెల్లడించాయి.

Read Also: Actress Praveena: ఆ కీచకుడు నా కూతురి నగ్న ఫోటోలు లీక్ చేశాడు

ముంబై వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ మధ్యలో ప్రకటనలు ఇచ్చేందుకు అడ్వర్‌టైజింగ్ కంపెనీలన్నీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ మొత్తానికి కేవలం రెండు మూడు బ్రాండ్స్ మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే భారీ ధరకు ఈ సిరీస్ బ్రాడ్ కాస్ట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ సంస్థ దక్కించుకుంది. ఒక్కో మ్యాచ్‌కు రూ.60.1 కోట్లను బీసీసీఐకి స్టార్ నెట్‌వర్క్ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ 30-40 శాతం ఆదాయాన్ని ప్రకటనలు, సేల్స్, సబ్‌స్క్రిప్షన్ ద్వారానే ఆర్జిస్తోంది. అయితే కొత్త ఏడాదిలో శ్రీలంకతో సిరీస్‌కు బీసీసీఐ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ ఆటగాళ్లను ఎంపిక చేయడంతో ప్రకటనదారులు ఆసక్తి చూపించలేదు. దీంతో తొలి టీ20కి హాట్‌స్టార్‌లో ఒక్క అడ్వైజర్ లేడు. లైవ్ బ్రాడ్‌కాస్ట్‌కు కూడా 15-20 శాతం ఇన్వెంటరీ మాత్రమే అమ్ముడైందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారి వివరించారు. అటు గ్రౌండ్ స్పాన్సర్‌షిప్ కూడా పడిపోయిందని.. ద్వైపాక్షిక సిరీస్‌లకు ఇదే ట్రెండ్ కొనసాగితే భారీ నష్టం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.