Pakistan: పాకిస్థాన్ బోర్డు సంచలన నిర్ణయం.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా షాహిద్ అఫ్రిది నియామకం

Shahid Afridi

Shahid Afridi

Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీని సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి న్యూజిల్యాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి కొత్త సెలెక్షన్ కమిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని పీసీబీ ప్రకటించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్టు సిరీసులను పాకిస్తాన్ ఓడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో వైట్ వాష్‌కు గురైంది. ఇంగ్లండ్ చేతిలో వరుస ఓటములతో పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రేసు నుంచి కూడా తప్పుకుంది. దీంతో పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రజాపై కూడా పీసీబీ వేటు వేసింది.

Read Also: Unstoppable: అందరి ముందే కాంట్రవర్సీ క్వేషన్ అడిగిన బాలయ్య…

ఈ నేపథ్యంలోనే కొత్త సెలెక్షన్ కమిటీని నియమిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా షాహిద్ అఫ్రిదీని నియమించగా.. అబ్దుల్ రజాక్, రావ్ ఇఫ్తికర్ అంజుమ్ కమిటీ సభ్యులుగా ఉంటారు. హరూన్ రషీద్ ఈ కమిటీకి కన్వీనర్‌గా సేవలు అందించనున్నాడు. కాగా తనకు కీలకమైన బాధ్యత అప్పగించడంపై షాహిద్ అఫ్రిదీ సంతోషం వ్యక్తం చేశాడు. మెరుగైన పాకిస్తాన్ జట్టును తయారు చేయడానికి తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని తెలిపాడు. పాకిస్థాన్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టేలా చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పాడు.