Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఆసక్తికర సమాధానం!

  • ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమి
  • రోహిత్ శర్మ 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్
  • మ్యాచ్‌కు ముందు రోహిత్ భవిష్యత్తుపై ఊహాగానాలు
Shubman Gill On Rohit Sharma Last Odi

Shubman Gill On Rohit Sharma Last Odi

Shubman Gill Ends Rohit Sharma’s Retirement Speculation: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో మరోసారి తన క్లాస్‌ బ్యాటింగ్‌ను చూపించాడు. 39 ఏళ్ల హిట్‌మ్యాన్ 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అయితే అతని పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 360/7కే పరిమితమై.. 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది.

రోహిత్ భవిష్యత్తుపై ఊహాగానాలు:

ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు వినిపించాయి. ప్రపంచ కప్ 2027 కోసం సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం కొత్త ప్రణాళికలపై దృష్టి సారిస్తున్నారని.. లార్డ్స్ మ్యాచ్ రోహిత్‌కు చివరిదని ప్రచారం జరిగింది. ఈ వార్తలు, ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా 110 బంతుల్లో 138 పరుగులు చేసి మరోసారి తన విలువేంటో చాటి చెప్పాడు. హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో భారత బ్యాటర్‌గా శతకం నమోదు చేసిన తొలి ఆటగాడిగా కూడా రోహిత్ చరిత్ర సృష్టించాడు. రోహిత్‌కు శుభ్‌మన్ గిల్ (77), విరాట్ కోహ్లీ (74) మంచి సహకారం అందించారు. గిల్‌తో 147 పరుగుల భాగస్వామ్యం, కోహ్లీతో 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌కు విజయంపై ఆశలు కల్పించాడు. అయితే చివరి ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ లక్ష్యానికి చేరుకోలేకపోయింది.

రోహిత్ భాయ్ మాతో ఏమీ చెప్పలేదు:

మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై వచ్చిన వార్తల గురించి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను రిపోర్టర్స్ ప్రశ్నించారు. దీనిపై గిల్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ‘అందంతా ఏమీ లేదు. లార్డ్స్ వన్డే తనకు చివరిదని రోహిత్ భాయ్ మాతో చెప్పలేదు. అలాంటి వార్తలు మీడియాలో మాత్రమే వస్తున్నాయి. అది చూసి మేము నవ్వుకున్నాం. రోహిత్ టీమిండియా కోసం ఇంకా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని తెలిపాడు. వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడడం తన టార్గెట్ అని హిట్‌మ్యాన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఓ ప్లేయర్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తేనే సంతోషంగా ఉంటాడు అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. రోహిత్ మెగా టోర్నీ వరకు వరకు ఆడడం ఖాయం.

2027 ప్రపంచ కప్ వరకు:

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు చేసిన సేవలను గిల్ ప్రశంసించాడు. ‘రోహిత్, కోహ్లీలు ఎన్నో సంవత్సరాలుగా భారత జట్టుకు అద్భుత సేవలు అందించారు. ఈ రోజు రోహిత్ భాయ్ 140కి చేరువగా ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం. చివర్లో పిచ్ నెమ్మదిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో అంత భారీ స్కోరు చేయడం అసాధారణం’ అని కొనియాడాడు. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు ఇంగ్లండ్‌లో చివరి వన్డే అయ్యే అవకాశమున్నప్పటికీ.. అతని ఆటతీరు మాత్రం ఇంకా తనలో ఎంతో క్రికెట్ మిగిలి ఉందనే సంకేతాలు ఇచ్చింది. సిరీస్‌ను భారత్ కోల్పోయినా.. రోహిత్, కోహ్లీలు 2027 ప్రపంచ కప్ వరకు భారత జట్టులో కొనసాగుతారనే అభిప్రాయం మరింత బలపడింది. లార్డ్స్‌లో రోహిత్ ఆడిన ఈ పోరాట శతకం చాలా కాలం పాటు అభిమానుల మదిలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌గా గుర్తుండిపోతుంది.