Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్‌ లేనట్టే!

  • రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు
  • ఎలాంటి సమాచారం ఇవ్వని రోహిత్ శర్మ
  • రోహిత్ శర్మ రిటైర్మెంట్‌ లేనట్టేనా?
Rohit Sharma Retirement

Rohit Sharma Retirement

No Official Decision Yet on Rohit Sharma Retirement: టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఇంకా తెరపడలేదు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం జరగనున్న మూడో వన్డే అనంతరం హిట్‌మ్యాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడనే వార్తలు 2-3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రోహిత్ ఇప్పటివరకు తన రిటైర్మెంట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సెలక్షన్ కమిటీ లేదా టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో హిట్‌మ్యాన్ భవిష్యత్తుపై అభిమానుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు:

2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగా యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఎక్కువ అవకాశాలు కల్పించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇంగ్లండ్ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే రోహిత్‌తో చర్చలు జరిగినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

భారత జట్టులో కీలక సభ్యుడే:

ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 11, 26 పరుగులు మాత్రమే చేయడంతో అతడి ఫామ్‌పై విమర్శలు పెరిగాయి. ఈ విమర్శల నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. రోహిత్‌కు మద్దతుగా నిలిచాడు. ‘రోహిత్ లాంటి గొప్ప ఆటగాడిపై ఒత్తిడి ఉంటుందని నేను అనుకోవడం లేదు. అతడు ఒక్క ఇన్నింగ్స్‌తోనే మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయకపోయినా అతడి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మూడో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్ ఆడుతాడు’ అని కోటక్ డిమా వ్యక్తం చేశాడు. అలాగే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ఈ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని, ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ భారత జట్టులో కీలక సభ్యుడే అని స్పష్టం చేశారు.

రిటైర్మెంట్‌ లేనట్టేనా?:

రోహిత్ శర్మ బీసీసీఐతో తన రిటైర్మెంట్‌ గురించి చెప్పకపోవడం, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వ్యాఖ్యలు, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కామెంట్స్ చూస్తుంటే.. హిట్‌మ్యాన్‌ క్రికెట్‌కు వీడ్కోలు అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఇది రోహిత్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనేది తన కోరిక అని ఇప్పటికే రోహిత్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు రోహిత్ గణాంకాలు ఇప్పటికీ అతని గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో 16, 48, 79 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇప్పటివరకు 11,757 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్.. 48.58 సగటుతో కొనసాగుతున్నాడు. వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగుల రికార్డు అతడి పేరిటే ఉంది. అంతేకాకుండా మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన రోహిత్.. మొత్తం 33 వన్డే సెంచరీలతో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడు.