NTV Telugu Site icon

కొత్త కోచ్‌, కొత్త కెప్టెన్‌ సారథ్యంలో తొలి మ్యాచ్‌…

ఒకరు ఐపీఎల్ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌..! మరొకరు అండర్‌ -19లో చెరగని ముద్రవేసిన కోచ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి సిరీస్‌కు రెడీ అయ్యింది టీమిండియా. ఇవాళ జైపూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్‌ ఆడనుంది. ఐతే పొగ మంచు విపరీతంగా ఉండటంతో… మ్యాచ్‌పై ఎఫెక్ట్‌ పడనుంది.

న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. టీ-20 వరల్డ్‌కప్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముమ్మర ప్రాక్టీస్‌ చేశారు ఆటగాళ్లు. కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్‌ ఆధ్వర్యంలో…నెట్‌లో చెమటోడ్చారు. కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు చేపట్టాక.. జరుగుతున్న తొలి సిరీస్‌ ఇది. సీనియర్లు, యువ ఆటగాళ్ల కలయికతో ఉన్న జట్టు.. సొంతగడ్డపై చెలరేగేందుకు వ్యూహాలు రచిస్తోంది. వరల్డ్‌కప్‌లో కివీస్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉంది. కివీస్‌ స్టార్‌ ప్లేయర్‌ విలియమ్‌సన్‌.. ఈ టీ20 సిరీస్‌కు దూరం కావడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. తొలి టీ20కు ఆతిథ్యమిచ్చే జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం పిచ్‌.. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే పొగ మంచు కారణంగా.. ఈ మ్యాచ్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సరైన టీమ్‌ కాంబినేషన్‌తో బరిలో దిగడమే ద్రవిడ్‌, రోహిత్‌ ముందు ఉన్న ప్రధాన సవాల్‌. రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ స్ట్రాంగ్‌గానే ఉంది. ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్‌ పాండ్య బదులు ఐపీఎల్‌లో రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ల విషయానికి వస్తే.. అశ్విన్‌, అక్షర్‌, చాహల్లో ఇద్దరికి అవకాశం దక్కొచ్చు. ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోసం జట్టులో తీవ్ర పోటీ ఉంది. ఏకంగా ఐదుగురు ఫాస్ట్‌ బౌలర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. బుమ్రాకు రెస్ట్‌ ఇవ్వడంతో భవనేశ్వర్‌కు తోడుగా అవేశ్‌ ఖాన్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌ పటేల్‌, సిరాజ్‌లలో ఒకరిద్దరికి చోటు దక్కొచ్చు.