PV Sindhu Uses Temple Smart Sensor Patch: క్రీడా రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ‘టెంపుల్’ పేరుతో పిలిచే చిన్న వేరబుల్ ఏఐ సెన్సార్ ప్యాచ్ ప్రస్తుతం స్పోర్ట్స్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. అథ్లెట్లు తమ తల భాగంలో, ముఖ్యంగా కనుబొమ్మల పక్కన ఉండే టెంపుల్ ప్రాంతంలో ఈ పరికరాన్ని ధరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేసే ఈ స్మార్ట్ డివైస్.. క్రీడాకారుల శారీరక, మానసిక పరిస్థితులను రియల్ టైమ్లో విశ్లేషించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. క్రీడాకారుల ఫిట్నెస్, ఫోకస్, అలసట స్థాయిలను అంచనా వేయడంలో ఈ డివైస్ కీలక పాత్ర పోషిస్తుంది.
టెంపుల్ సెన్సార్ ప్యాచ్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ఇది అథ్లెట్ల మెదడులో రక్తప్రసరణ ఎలా జరుగుతోందో నిరంతరం ట్రాక్ చేస్తుంది. అలాగే క్రీడాకారుల మానసిక ఒత్తిడి స్థాయి, మెదడు చురుకుదనం వంటి అంశాలను కూడా గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని అప్పటికప్పుడు కోచ్లు, ట్రైనర్లకు అందిస్తుంది. దాంతో ఒక అథ్లెట్ ఎంత అలసటకు గురవుతున్నాడు, ఇంకా ఎంతసేపు శిక్షణ తీసుకోవచ్చు, ఎప్పుడు విశ్రాంతి అవసరం వంటి విషయాలపై కోచ్లు ఖచ్చితమైన అంచనాలకు రానున్నారు.
ఇప్పటివరకు కోచ్లు అథ్లెట్ల శారీరక పరిస్థితిని అనుభవం ఆధారంగా అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు ఈ ఏఐ డివైస్ ద్వారా ఖచ్చితమైన డేటా అందుబాటులోకి రానుంది. దీంతో అథ్లెట్లు తమ ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు గాయాల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్లో ఇది గేమ్చేంజర్గా మారే అవకాశం ఉంది. భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇప్పటికే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. శిక్షణ సమయంలోనే కాకుండా లైవ్ మ్యాచ్ల్లో కూడా టెంపుల్ పనితీరును పరీక్షిస్తున్నారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ సెన్సార్ను అభివృద్ధి చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ టెక్నాలజీ.. భవిష్యత్తులో ప్రపంచ క్రీడా రంగంలో పెద్ద మార్పులకు నాంది పలకనుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక ‘ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్’ 2026లో పీవీ సింధు పాల్గొనగా.. ఆమె ధరించిన ఏఐ సెన్సార్ ప్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ కూడా టెంపుల్ గురించి తెలుసుకున్నట్లు సమాచారం.
