ఐపీఎల్ సీజన్ 2022 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని విధంగా జట్ల మధ్య పోటీ జరుగుతోంది. ఐపీఎల్ సీజన్లలోనే ఈ సీజన్ ప్రత్యేకంగా నిలుస్తుందని కొందరు క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే నేడు ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ను ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. డీసీ అరంగేట్రం బౌలర్ చేతన్ సకారియా బౌలింగ్లో ఆరోన్ ఫించ్ (7 బంతుల్లో 3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నితీశ్ రాణా (33 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 57), శ్రేయస్ (37 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
అయితే అనంతరం.. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయినప్పటికీ ఆఖర్లో రోవ్మన్ పావెల్ (33 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో డేవిడ్ వార్నర్ (42), మధ్యలో లలిత్ యాదవ్ (22), అక్షర్ పటేల్ (27) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించగా.. కేకేఆర్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (3/24) ఆరంభంలోనే వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. హర్షిత్ రాణా, నరైన్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఢిల్లీ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో కేకేఆర్పై విజయం సాధించింది.
