Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!

Nitish Kumar Reddy Comments

Nitish Kumar Reddy Comments

Nitish Kumar Reddy Reaction On His Bowling vs Afghanistan: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం భారత్ 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో సంజు శాంసన్‌ (57), అభిషేక్‌ శర్మ (39), ఇషాన్‌ కిషన్‌ (38 నాటౌట్‌) చెలరేగగా.. బౌలింగ్‌లో తెలుగు ఆటగాడు, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (3/24) సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో నితీశ్ రెడ్డికి ఛాన్స్ రాలేదు.

రెండో టీ20లో నితీశ్ కుమార్ రెడ్డి బంతితో అద్భుతంగా రాణించాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు గాను నితీశ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న తర్వాత తన శరీరం ప్రస్తుతం బాగుందని తెలిపాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (సీఓఎ) చేసిన కృషి కారణంగా తన శరీరం బాగా కోలుకుందని చెప్పాడు. ప్రస్తుతం తాను ఎంతో ఉత్సాహంగా, ఫిట్‌గా ఉన్నానని వెల్లడించాడు.

తన బౌలింగ్‌లో అదనపు వేగంపై నితీశ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఎప్పుడూ గొప్ప ఆల్‌రౌండర్‌ కావాలని అనుకుంటుంటా. అందుకోసం నా బౌలింగ్‌లో అదనపు వేగం ఉండాలని భావించాను. ఇప్పుడు ఆ వేగం వస్తోంది. దాంతో పాటు కొన్ని ప్రయోజనాలు, ప్రతికూలతలు కూడా ఉంటాయి. తరచూ గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండటంపై దృష్టి పెడుతున్నాను. తొలి టీ20 తర్వాత రెండో మ్యాచ్‌లో బంతితో మెరుగైన ప్రదర్శన చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. నా సామర్థ్యంపై నమ్మకం ఉంచడమే ఈ విజయానికి కారణం. గాయం తర్వాత తిరిగి వచ్చిన సమయంలో నాపై నమ్మకం పెట్టుకున్నా. సామర్థ్యాన్ని నమ్ముకోవడమే ముఖ్యం. క్రికెట్ చాలా విచిత్రమైన ఆట. ఒక్క క్షణంలో ఏదైనా మారిపోవచ్చు’ అని వెల్లడించాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన నితీశ్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విలువైన ఆటగాడిగా నిలిచాడు.