Team India: ప్రస్తుతం టీమిండియాలో ఫామ్లో లేని ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు రిషబ్ పంత్. అతడు పదే పదే విఫలమవుతున్నా అవకాశాలు మాత్రం ఇంకా ఇస్తున్నారు. ఒకానొక సమయంలో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అనేక అవకాశాలు ఇస్తున్నా అతడి ఆటతీరులో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా పంత్ ఆటతీరుపై స్పందించారు. ‘ఎన్నడా పంత్.. ఇదేం ఆటతీరు’ అంటూ తమిళంలో వ్యాఖ్యానించారు. ఇచ్చిన అవకాశాలను పంత్ వృథా చేస్తున్నాడని, అతడి ప్రదర్శన తనకు చాలా నిరాశ కలిగిస్తోందని శ్రీకాంత్ అన్నారు. ప్రతి మ్యాచ్లోనూ విఫలమవుతున్న పంత్ తన పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Coins In Stomach: ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్.. కడుపా లేదా కిడ్డీ బ్యాంకా ?
పంత్ ఫామ్లోకి రావాలంటే అతడి మైండ్ సెట్ మారాలని.. దీని కోసం అతడు విశ్రాంతి తీసుకోవాలని కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. ఇటీవల విరామం ద్వారా కోహ్లీ ఫామ్ అందుకున్న తరహాలో వన్డే ప్రపంచకప్ నాటికి పంత్ కూడా ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. పంత్ తనకు దొరికిన విరామంలో దేశవాళీ క్రికెట్ ఆడితే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో పంత్ కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. అది కూడా బలహీనమైన వెస్టిండీస్పైనే నమోదు చేశాడు. 2022లో ఇప్పటిదాకా పంత్ 21 ఇన్నింగ్స్లు ఆడితే అందులో 30కి పైబడి పరుగులు చేసింది కేవలం రెండుసార్లే. అటు వన్డేల్లో ఈ ఏడాది 9 ఇన్నింగ్స్లు ఆడగా ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.