భారత మాజీ మహిళా క్రికెటర్ తల్లి కరోనా ట్రీట్మెంట్ కోసం తన వంతు సాయం అందించాడు విరాట్ కోహ్లీ. టీమిండియా మాజీ మహిళ క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ స్రవంతి నాయుడు చికిత్స కోసం రూ.6.77 లక్షలను కోహ్లీ విరాళంగా ఇచ్చాడు. తనకు సాయం చేసినందుకు ఆ మహిళా క్రికెటర్, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
స్రవంతి నాయుడు తల్లి ఎస్కే సుమన్ ఇటీవలే కరోనా బారీన పడ్డారు. ఆమె పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. అప్పటికే తల్లి చికిత్స కోసం రూ.16 లక్షల వరకు స్రవంతి ఖర్చు చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సాయం చేయాలంటూ స్రవంతి బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘంను కోరింది. అయితే, స్రవంతి అభ్యర్థనను ఓ ట్వీట్ లో పేర్కొన్న బీసీసీఐ సౌత్ జోన్ మాజీ కన్వీనర్ ఎన్. విద్యా యాదవ్ తన ట్వీట్ కు విరాట్ కోహ్లీని కూడా ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన కోహ్లీ… స్రవంతి నాయుడు తల్లి కోసం రూ.6.77 లక్షలు విరాళంగా అందించారు.